ప్రజాశక్తి-నర్సీపట్నం టౌన్: స్థానిక శారద నగర్ 16వ వార్డులో రూ.15 లక్షలతో సిసి రోడ్ల నిర్మాణం చేపట్టేందుకు ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్, మున్సిపల్ చైర్పర్సన్ ఆదిలక్ష్మిలు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ, ఎంపీ సత్యవతి సుమారు రూ.70 లక్షల వరకు మంజూరు చేశారని, ఈ నేపద్యంలోనే సిసి రోడ్లన్నీ త్వరితగతిన నిర్మిస్తున్నట్లు తెలిపారు.మున్సిపాలిటీలో సిసి రోడ్లను పూర్తి చేస్తామన్నారు. మున్సిపాలిటీ సమస్యలను ఇటీవల నర్సీపట్నంలో పర్యటించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లామన్నారు. పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తన్నామన్నారు. రూ.500 కోట్లతో మెడికల్ కాలేజ్ నిర్మాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారన్నారు. ఈ ప్రాంత ప్రజలు వైద్యం నిమిత్తం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడే వైద్యం పొందేలా మెడికల్ కాలేజీ నిర్మిస్తున్నామన్నారు. సుమారు 600 పడకల ఆసుపత్రి ఏర్పాటు అవుతుందన్నారు. రూరల్ ప్రాంతంలో గడపగడపకు కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. 35 సచివాలయాలకు గాను ఏడు కోట్ల వరకు నిధులు మంజూరు చేశామన్నారు. సంక్రాంతికి ప్రతి అక్కా చెల్లెలు సిసి రోడ్లుపైన ముగ్గులు వేసుకునే విధంగా రోడ్లు నిర్మిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.










