
ఉమ్మడి సర్వీసు రూల్స్ లేకుండా నియామకం తగదు : యుటిఎఫ్
ప్రజాశక్తి-కర్నూలు కలెక్టరేట్: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిపిఎస్ను రద్దు చేయకుండా అక్రమంగా నోటీసులు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జయరాజు ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే సిపిఎస్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సిపిఎస్ ఉద్యమంలో పాల్గొనకూడదంటూ అక్రమంగా పోలీసు శాఖ ద్వారా నోటీసులు ఇవ్వడాన్ని ఖండిస్తూ జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావును యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ఎం.జయరాజుతో కూడిన ప్రతినిధి బృందం కలిసి వినతిపత్రం సమర్పించింది. ఎన్నికల ముందు పాదయాత్ర సందర్భంగా సిపిఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ఇప్పటివరకు హామీని నిలబెట్టుకోలేదన్నారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. సిపిఎస్ ఉద్యమంలో పాల్గొనకుండా కార్లు, మోటారుసైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకోవడం సరైంది కాదన్నారు. ఉపాధ్యాయులు ఏ రకంగా పాఠశాలలకు వెళ్లి తమ విధులను నిర్వహించుకోవాలని పేర్కొన్నారు. వెంటనే అక్రమ నోటీసులను ఇవ్వడం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ ఉమ్మడి సర్వీసు రూల్స్ రాకముందే రాష్ట్ర ప్రభుత్వం ఎంఇఒ పోస్టులను కేవలం ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అదనపు బాధ్యతలను అప్పగించడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ విషయంలో హైకోర్టులో కేసు ఉన్నప్పటికీ ప్రభుత్వం నిరంకుశంగా ఉత్తర్వులు ఇవ్వడం తగదన్నారు. వెంటనే ఉత్తర్వులను ఉపసంహరించుకొని జిల్లా పరిషత్తు,ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఎంఇఒలుగా నియమించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనబాట పడతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆయన వెంట జిల్లా సహాధ్యక్షుడు రవికుమార్,గౌరవాధ్యక్షుడు మారెప్ప, జిల్లా ఆర్థిక కార్యదర్శి హేమంత్ కుమార్,, జిల్లా కార్యదర్శిలు నవీన్ పాటి, యెహోషువ, ఎస్.ఇబ్రహీం, కర్నూల్ నగర అధ్యక్షుడు భాస్కర్, జిల్లా ఆడిట్ కన్వీనర్ మద్దిలేటి పాల్గొన్నారు.