Jul 09,2023 00:31

ప్రజాశక్తి-కాకినాడ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్‌ రద్దు చేసి ఒపిఎస్‌ విధానాన్ని పునరుద్ధరిస్తానని ఎన్నికల ముందు వైఎస్‌.జగన్‌ఉద్యోగులకు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ శనివారం సిపిఎస్‌ ఉద్యోగులు స్థానిక ధర్నా చౌక్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ఎజి.కష్ణ అధ్యక్షతన చింతా నారాయణమూర్తి, బాషా, ఎంఎ.అలీం శిబిరాన్ని ప్రారంభించారు. ఈ ధర్నాలో అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డిఆర్‌.రవికుమార్‌ మాట్లాడుతూ 13 ఉమ్మడి జిల్లా కేంద్రాల వద్ద ప్రతిఘటన ధర్నా పేరుతో సిపిఎస్‌ రద్దు చేయాలని ఒపిఎస్‌ను పునరుద్ధరించాలని నిరసన కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. వైఎస్‌.జగన్‌ ప్రతిపక్ష నేతగా తమకు ఆనాడు ఇచ్చిన హామీని అమలు చేయకపోగా సిపిఎస్‌ విధానం కంటే దారుణమైన గ్యారెంటీ పెన్షన్‌ పేరుతో జిపిఎస్‌ విధానం అమలు చేయాలని చూడడం శోచనీయమన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ వైనాట్‌ 175 అని పిలిపిస్తున్నారని దానిలో భాగంగానే తాము కూడా వైనాట్‌ ఒపిఎస్‌ అని పిలుపు ఇస్తున్నామన్నారు. ఒపిఎస్‌ పునరుద్ధరించే వరకు నిరసన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని ఎప్పటికైనా సిపిఎస్‌ను రద్దు చేసి ఒపిఎస్‌ను పునరుద్ధరించడం తప్పదని స్పష్టం చేశారు. ఈ ధర్నాలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జయరాం, సిపిఎస్‌ నాయకులు బండారు నారాయణ, పివి.గోపాల్‌, పిఆర్‌టియు జిల్లా అధ్యక్షులు ప్రదీప్‌, ఎపియుఎస్‌ జిల్లా అధ్యక్షుడు చలపతి, ఆర్‌యుపిపి నాయకులు పల్లంరాజు, మెడికల్‌ ఎంప్లాయిస్‌ జిల్లా నాయకులు డిఎ.రాజు, ఫ్యాఫ్టో జిల్లా నాయకులు, బంగార్రాజు, మురళీకృష్ణ, చిన్నబాబు, వెంకటేశ్‌, రమేష్‌, వెంకటలక్ష్మి, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.