Oct 25,2022 22:27

జలపాతం రోడ్డు పనులను పర్యవేక్షిస్తున్న సర్పంచ్‌ మొస్య

శరవేగంగా సాగుతున్న నిర్మాణ పనులు
రహదారి పటిష్టానికి చర్యలు చేపట్టాలని అధికారులకు వినతి
ప్రజాశక్తి -అనంతగిరి :
మండలంలోని టోకూరు పంచాయతీ చిట్టంపాడు జలపాతాన్ని సందర్శనకు వచ్చే పర్యాటకుల సౌకర్యార్థం జలపాతం వరకు తాత్కాలిక రహదారి పనులు సిపిఎం సర్పంచ్‌ కిల్లో మొస్య పర్యవేక్షణలో పనులు జోరుగా సాగుతున్నాయి. చిట్టంపాడు గ్రామం నుంచి జలపాతం వరకు కొండల మార్గంలో వాటర్‌ఫాల్స్‌ తిలకించేందుకు వచ్చే పర్యాటకులు కొంతమేర రోడ్డు, తర్వాత కాలినడకన వెళ్లడానికి వీలుగా తాత్కాలిక రోడ్డు పనులను జెసిబి సాయంతో, సర్పంచ్‌ చొరవతో చేస్తున్నారు. ఈ రోడ్డు అభివృద్ధి చేయడం ద్వారా కొట్టెంపాడు వాటర్‌ఫాల్స్‌ చూసేందుకు వచ్చే సందర్శకుల సంఖ్య గణనీయంగా పెరిగితే, ఈ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందడంతోపాటు పంచాయతీకి అదనపు ఆదాయం సమకూరుతుందన్న లక్ష్యంతోనే ఈ రోడ్డు పనులు చేపడుతున్నట్లు సర్పంచ్‌ మొస్య వెల్లడించారు. తాము తాత్కాలికంగా వేసిన రోడ్డు మార్గాన్ని పటిష్టం చేసి, శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేసేందకు పర్యాటకశాఖ అధికారులు చొరవ చూపాలని, ఇక్కడి పరిస్థితులను జిల్లా కలెక్టర్‌ ,ఐటిడిఎ పిఒ దృష్టికి తీసుకెళ్లి, వారి ద్వారా అధిక మొత్తంలో ప్రభుత్వ నిధులు మంజూరు చేయించి, చిట్టెంపాడు జలపాతానికి పక్కారోడ్డుతోపాటు, ఇతర సౌకర్యాలను కల్పించాలని కోరుతున్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ సార.దొన్ను, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు