Oct 28,2023 22:19

 

ప్రజాశక్తి- పలమనేరు : అసమానతలు లేని అభివృద్ధి కోసం సిపిఎం ఆధ్వర్యంలో ప్రజారక్షణ భేరి కార్యక్రమం జరుగుతున్నదని దీన్ని జయప్రదం చేయాలని సిపిఎం ప్రజాప్రణాళికను శనివారం పలమనేరు సిపిఎం కార్యాలయంలో జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ప్రజారక్షణ భేరి జయప్రదం చేయడానికి జిల్లాలో నవంబర్‌ 4న బస్సు జాతా వస్తున్నదని ఘనంగా జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. దేశంలో, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు ప్రజలందరినీ కలవరపరుస్తున్నాయని అన్నారు. ఎవరో వచ్చి మనల్ని ఉద్ధరిస్తారని ఎదురు చూసే కన్నా మన బతుకులను రాష్ట్ర భవిష్యత్తును సక్రమంగా నడిపించడానికి ప్రజలందరూ ఐక్యంగా ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ఉద్యమంలో సిపిఎం అండగా ఉంటుందని తెలిపారు. రాష్ట్రాన్ని విడగొట్టి 10 సంవత్సరాలు పూర్తికావస్తోంది అప్పుడు మనకు అరచేతులో స్వర్గం చూపించారని అన్నారు. కేంద్రంలోని బిజెపి నాయకులు ప్రత్యేక హోదా, పోలవరం జాతీయ ప్రాజెక్టు, కడప ఉక్కు ఫ్యాక్టరీ, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ కేంద్ర విద్యాసంస్థల ఏర్పాటు, రైల్వేజోన్‌ వంటి హామీలు ఇచ్చి ఈ ఒక్కటి కూడా హామీలు అమలు కాలేదని అన్నారు. లౌకికవాదం, ప్రజాస్వామ్య పరిరక్షణ అసమానతలు లేని అభివద్ధి కోసం సిపిఎం ప్రజారక్షణ భేరి కార్యక్రమం నవంబర్‌ 15న విజయవాడలో భారీ బహిరంగసభ నిర్వహిస్తున్నదని తెలిపారు. ప్రజాసంక్షేమం కోసం ప్రజాప్రణాళికను ప్రజలు ముందు ఉంచిందని, కరెంట్‌ యూనిట్‌ రూపాయికే, పేదలకు 300 యూనిట్ల వరకు ఉచితంగా, స్మార్ట్‌ మీటర్లు వద్దు, ఛార్జీలు రద్దు చేయాలని, రూ.400లకే గ్యాస్‌, రూ.60లకే లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌, ఇసుక ఉచితం, అందరికీ సంక్షేమం పెన్షన్‌, రేషన్‌కార్డులు, అన్ని రకాల పెన్షన్లు రూ.5వేలు, పేదలకు రెండు సెంట్లు ఇల్లు, ఐదు లక్షల ఆర్థిక సాయం, 40 వేల టీచర్లకు మెగా డీఎస్సీ, 2 లక్షల 50 వేల ప్రభుత్వ ఖాళీ పోస్టులు, నిరుద్యోగ భృతి నెలకు రూ.5వేలు, ఓపీఎస్‌ పునరుద్ధరణ, ప్రైవేటు ఉపాధ్యాయులు కనీస వేతనం, ఉద్యోగ భద్రత, భూమిలేని వ్యవసాయ కూలీలకు కౌలు రైతులకు రెండు ఎకరాల భూమి, అసలు పట్టాదారులకే అసైన్మెంట్‌ భూముల హక్కులు కల్పించడం, గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 200 రోజులు, పని గ్యారంటీ అసంఘటితరంగా కార్మికుల కనీసం 26,000, సమగ్ర సంక్షేమ చట్టం స్కీం కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం, రైతులు గిట్టుబాటు ధర కల్పించడం లాంటి ప్రజా ప్రణాళికను సిపిఎం విడుదల చేసిందని తెలిపారు. ప్రజారక్షణ భేరి జయప్రదం చేయడానికి నవంబర్‌ 4న జిల్లాకు వస్తున్న బస్సు జాతాను జిల్లాలోని ప్రజానీకం పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా సిపిఎం నాయకులు ఓబులురాజు, గిరిధర్‌ గుప్తా, భువనేశ్వరి, నాయకులు ఈశ్వరయ్య, అంజి, ధనలక్ష్మి సరోజమ్మ పాల్గొన్నారు.