
ప్రజాశక్తి -ఎంవిపి కాలనీ : మద్దిలపాలెం పిఠాపురం కాలనీలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో ప్రజా ప్రణాళికను సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో అసమానతలు లేని అభివృద్ధికోసం సిపిఎం నవంబరు 15న విజయవాడ ఎంబి స్టేడియంలో లక్షలాది మందితో ప్రజా రక్షణ భేరి (భారీ బహిరంగ సభ) నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేలా వైసిపి, టిడిపి, జనసేన, బిజెపి విధానాలుంటున్నాయన్నారు. బిజెపి, వైసిపి ప్రభుత్వాలు ప్రజలను పీడిరచేలా ధరలు పెంచి భారాలు మోపుతున్నాయన్నారు. 2024 ఎన్నికల్లో ప్రజల అజెండా, అసమానతలు లేని అభివృద్ధికోసం నవంబరు 1న రాష్ట్రంలో 3 ప్రాంతాల నుంచి రాష్ట్ర బస్సుయాత్రలను సిపిఎం చేపడుతున్నట్లు తెలిపారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి జంక్షన్కు నవంబర్ 3న సాయంత్రం చేరుకుంటుందని, 4న ఎన్ఎడి జంక్షన్, కంచరపాలెం మెట్టు, పూర్ణామార్కెట్, శ్రీహరిపురం, గాజువాక, కూర్మన్నపాలెం మీదుగా యాత్ర సాగుతుందని, సభలు జరుగుతాయని తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వరంగ సంస్థల పరిరక్షణ, ఖాళీగా ఉన్న రెండున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ, మూతపడిన పరిశ్రమలు తెరిపించడం, ధరలు అదుపుచేయడం, వంటగ్యాస్ ధర రూ.400లు, పెట్రోల్, డీజిల్ లీటరు రూ.60కే ఇవ్వడం, పేదలందరికీ ఉచిత విద్య, వైద్యం అందించడం, సామాజిక పెన్షన్ నెలకు రూ.5వేలు, ఇళ్లు లేనిపేదలకు నివాస గృహాలు ఏర్పాటు, మెగా డిఎస్సీ, నిరుద్యోగ భృతి రూ.5000, రైతులకు గిట్టుబాటు ధర, అసంఘటితరంగ కార్మికులకు సమగ్ర చట్టం, కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజేషన్, కనీసవేతనం రూ.26వేలు, స్కీం వర్కర్లను ప్రభుత్వఉద్యోగులుగా గుర్తింపు, పేదలకు 300 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, మైనార్టీల హక్కుల పరిరక్షణ, రిజర్వేషన్లు అమలు, వృత్తిదారులు, వికలాంగులకు ఉపాధి భద్రత, మహిళలకు రక్షణ, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక నిధులు కేటాయింపు, ప్రత్యేక హోదా, విశాఖ రైల్వేజోన్, విభజన హామీల అమలు వంటివాటితో కూడిన ప్రజాప్రణాళికను సిపిఎం ప్రజల ముందుంచుతుందని తెలిపారు. ఇది అమలు జరిగేందుకు సిపిఎంను బలపర్చాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్కెఎస్వి.కుమార్, జిల్లా కమిటీ సభ్యులు వి.కృష్ణారావు పాల్గొన్నారు.