ప్రజాశక్తి-బాపట్ల రూరల్: చలనచిత్ర నేపథ్య గానానికి ఒక నిఘంటువులా, దిశానిర్దేశకునిలా, ఎందరో గాయకులకు స్ఫూర్తి ప్రదాతలా, సినీ సంగీత గగన ధ్రువ తారలా సంగీత ప్రియులను అలరించిన మొహమ్మద్ రఫీ అమర గాయకులని సప్తస్వర సంగీత కళాశాల ప్రిన్సిపల్ కోటిరాజు అన్నారు. శనివారం మొహమ్మద్ రఫీ 98వ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కోటి రాజు మాట్లాడారు. నటుల హావభావాలకు అనుగుణంగా కవి యొక్క నిగూఢ భావాలు పామరులకు సైతం అర్థమయ్యే రీతిలో పాటలు పాడి సినిమా ప్రేక్షకులను సంగీత సాగరంలో ఓలలాడించిన సుమధుర గాన సామ్రాట్ అని పేర్కొన్నారు. ప్రధాన అతిథిగా విచ్చేసిన తలపల శ్రీనివాసరావు మాట్లాడుతూ మహమ్మద్ రఫీకి ఆరు ఫిలింఫేర్ అవార్డులు లభించాయని, వారు హిందీ, పంజాబీ, మరాఠీ, తెలుగు తదితర భారతీయ భాషలలోనే కాక ఇంగ్లీష్, ఫార్సీ అరబ్బీ, సింహళి, డచ్ వంటి విదేశీ భాషలతో పాటు 21 భాషలలో పాడి ప్రపంచ సంగీత ప్రియుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. దైవభక్తి, దేశభక్తి, విరహ, ప్రణయ, హాస్య, సందేశాత్మక గీతాలతో పాటు గజల్, ఖవ్వాలి వంటి పాటలు కూడా భావయుక్తంగా ఆలాపించి రస హృదయాలను రంజింప చేశారని కొనియాడారు. సాహితీ భారతి అధ్యక్షులు రావూరి నరసింహ వర్మ మాట్లాడుతూ మొహమ్మద్ రఫీ 20 వేల పైచిలుకు పాటలు పాడారన్నారు. తెలుగులో పదండి ముందుకు, భలే తమ్ముడు, తల్లా? పెళ్లామా?, ఆరాధన, రామ్ రహీం, అక్బర్ సలీం అనార్కలి వంటి సినిమాలలో కూడా పాడి తెలుగు సంగీత ప్రియుల హృదయాలను చూరగొన్నారని కీర్తించారు. ఈ సభలో మర్రి మాల్యాద్రి రావు, ఆదం షఫీ, కస్తూరి శ్రీనివాస్, శ్రీమతి అల్లూరమ్మ, బొడ్డుపల్లి శ్రీరామచంద్రమూర్తి, అవ్వారి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొని మహమ్మద్ రఫీకి ఘన నివాళులు అర్పించారు.










