
ప్రజాశక్తి- దేవరాపల్లి
మండల కేంద్రంలో మార్చి 18న రాత్రి సమయంలో అనుమానస్పదంగా మృతి చెందిన జామి సింహచలంనాయుడు కుటుంబానికి పోలీసులే తీవ్రమైన అన్యాయం చేశారని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి.వెంకన్న సింహాచలంనాయుడు కుటుంబ సభ్యులు ఆరోపించారు. దేవరాపల్లి మండల కేంద్రంలో సింహాచలం నాయుడు తల్లి సింహచలమ్మ, గవిరెడ్డి దేముడునాయుడు, బండారు అప్పలనాయుడు, జామి శ్రీను, చొక్కాకుల దేముళ్ళు, జామి చిన్నం నాయుడు, పాసిల వెంకటరావు, పి.సతీష్ తదితరులతో కలిసి గురువారం వెంకన్న విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. సింహచలంనాయుడు మృతికి సంబంధించి అనుమానితులపై కేసులు పెట్టాలని ఏప్రిల్ 14న స్థానిక పోలీసు స్టేషన్ ఎదుట నిరాహార దీక్ష చేశామని తెలిపారు. నాడు అనకాపల్లి డిఎస్పి ఫోన్లో మాట్లాడి కె.కోటపాడు ఎస్సై ధనుంజేయరావును కేసు దర్యాప్తుకు నియమిస్తామని, కేసులో పురోగతి సాధించని ఎడల కేసుకు సంబంధించిన ఫైల్ మృతుని తల్లికి ఇస్తామని, అవసరమైతే కోర్టులో ప్రైవేటు కేసు వేసుకోవచ్చని ఆయన హామీ ఇవ్వడంతో దీక్ష విరమించామని పేర్కొన్నారు. పోలీసులు కేసులో పురోగతి సాధించకపోగా పైనల్ పోస్ట్మార్టంలో సింహచలంనాయుడు పురుగుల మందు తాగి ఉరి వేసుకున్నారని పోలీసులు తెలిపారని వెల్లడించారు. సింహచలంనాయుడు ఆత్మహత్య చేసుకుంటే, దానికి ప్రేరేపించిన వారిపై కేసు అయినా పెట్టండి, లేదా కేసుకు సంబంధించిన ఫైల్ అయినా ఇవ్వాలని కె.కోటపాడు పోలీసు స్టేషన్ చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా రెండూ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సింహచలంనాయుడు హత్యను పోలీసులు కావాలనే ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపించారు. పురుగుల మందు తాగిన వ్యక్తి మళ్లీ ఉరి వేసుకోవలసిన అవసరం ఏముందని ప్రశ్నించారు. సింహచలంనాయుడు కుటుంబానికి న్యాయం జరిగే వరకు దేవరాపల్లి ప్రజల మద్దతు కూడగట్టి దశలవారీగా ఆందోళన చేస్తామని వారు స్పష్టం చేశారు.