ప్రజాశక్తి-గుంటూరు లీగల్ : గుంటూరు నగరానికి చెందిన సీనియర్ న్యాయవాది, పూర్వ బార్ అసోసియేషన్ అధ్యక్షులు చేగూడి ఐజయ్య గురువారం హైదరాబాద్లో అనారోగ్యంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మృతి చెందారు. ఐజయ్య కాకుమాను మండలం, తెలగాయపాలెంలో జన్మించారు. ఏసీ లా కాలేజిలో న్యాయవిద్యను అభ్యసించారు. 1988 నుండి గుంటూరు జిల్లా కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు చేస్తున్నారు. ఐజయ్యకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బార్ అసోసియేషన్లోని న్యాయవాదులందరితో స్నేహశీలిగా ఉండేవారు. జూనియర్ అడ్వకేట్స్ను వృత్తిపట్ల ప్రోత్సహించే వారు. సివిల్, క్రిమినల్ కేసుల్లో మంచి పేరు సంపాదించారు.ఈయన మృతికి గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కె.వి.కె.సురేష్, కార్యదర్శి వంశీకృష్ణ, ఉపాధ్యక్షులు దాసరి ఉమామహేశ్వరరావు, ట్రెజరర్ జి.విజయరాజ్కుమార్, ఇతర కార్యవర్గ సభ్యులు, న్యాయవాదులు సంతాపం తెలిపారు.










