
ప్రజాశక్తి -నక్కపల్లి:సీజనల్ వ్యాధుల పట్ల వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి హేమంత్ సూచించారు. మండలంలోని గొడిచెర్ల పిహెచ్సిని శనివారం ఆయన సందర్శించారు. రికార్డులను తనిఖీ చేశారు. ఆసుపత్రికి వచ్చిన రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఆసుపత్రిలో ఉన్న మందులను పరిశీలించారు. మందులు కొరత రాకుండా ముందస్తుగా చూసుకోవాలన్నారు. డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాలపై డాక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, వ్యాధి సోకిన రోగులను గుర్తించి సకాలంలో వైద్యం అందించాలని సూచించారు.సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.గునుపూడి గ్రామంలో ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాంను సందర్శించారు. రోగులకు పూర్తిస్థాయిలో వైద్య సేవలను అందించాలని సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణపై చర్యలు చేపట్టాలన్నారు. పరిసరాల పరిశుభ్రత పై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు మురళీ కృష్ణారెడ్డి, సుకన్య, కిరణ్ ప్రసాద్, ఎంపీహెచ్ఈఓ రామకృష్ణ పాల్గొన్నారు .