Oct 01,2023 00:17

ప్రజాశక్తి -సామర్లకోట రూరల్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సామర్లకోట పర్యటన అక్టోబర్‌ 5న ఖరారైన నేపథ్యంలో తుది దశకు చేరిన పనులన్నింటిని వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. శనివారం రాష్ట్ర హౌసింగ్‌ బోర్డు చైర్మన్‌ దవులూరి దొరబాబు, హౌసింగ్‌, డ్వామా, మున్సిపాలిటీ, పబ్లిక్‌ హెల్త్‌, ఆర్డబ్ల్యూఎస్‌ తదితర శాఖల అధికారులతో కలిసి కలెక్టర్‌ పనుల పురోగతిని పరిశీలించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇటిసి జగనన్న కాలనీలో ఇంకా మిగిలిన పనుల అన్నిటిని అధికారులు సమన్వయంతో పనిచేసి సకాలంలో పూర్తి చేయాలన్నారు. నూతనంగా నిర్మించిన గృహాలను అలంకరించాలని సూచించారు. ఈ పర్యటనలో కలెక్టర్‌ వెంట హౌసింగ్‌ పీడీ బి.సుధాకర్‌ పట్నాయక్‌, డ్వామా పీడీ ఎ.వెంకటలక్ష్మి, సామర్లకోట మున్సిపల్‌ కమిషనర్‌ జె.రామారావు, కాకినాడ, పెద్దాపురం డిఎల్‌డిఒలు పాటంశెట్టి నారాయణమూర్తి, ప్రసాద్‌, ఎంపిపి బొబ్బరాడ సత్తిబాబు ఇంజనీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.