ప్రజాశక్తి -నౌపడ: సంతబొమ్మాలి మండలంలోని మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్ట్కు సంబంధించి ఆర్అండ్ఆర్ కాలనీ, పోర్టు నిర్వాసితుల అభిప్రాయాలను సిఎం దృష్టికి తీసుకొని వెళ్లి పరిష్కరిస్తానని ఎమ్మెల్సీ శ్రీనివాస్, వైసిపి టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ వాణి తెలిపారు. సోమవారం మూలపేటలో నిర్వాసితులతో జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. బాధితుల అభ్యంతరాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నిర్వాసితులకు పెండింగ్ బకాయిలు, ఆర్అండ్ఆర్ కాలనీలో తాగునీటి వసతి కల్పిస్తామని వారు తెలిపారు. దీనిపై ఎవరూ అపోహపడద్దని, మీ సమస్యలన్నీ పరిష్కారం అయ్యేంతవరకు అండగా ఉంటానని ఎమ్మెల్సీ శ్రీనివాసరావు, దువ్వాడ వాణి తెలిపారు. కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ మాట్లాడుతూ చట్టబద్ధంగా నిర్వాసితులకు రావలసిన పరిహారం అందజేస్తామని తెలిపారు. అధునాతన హంగులతో నౌపడలో ఆర్అండ్ఆర్ కాలనీ నిర్మాణం చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పి జిఆర్ రాధిక, డిఎస్పి బాలచంద్రారెడ్డి, సర్పంచ్ బాబూరావు, తదితరులు పాల్గొన్నారు.










