Oct 14,2023 17:28

ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
    మానసిక స్థితి సరిగా లేక సిఎం జగన్‌మోహన్‌ రెడ్డి జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని జనసేన చింతలపూడి నియోజకవర్గ ఇన్‌ఛార్జి మేక ఈశ్వరయ్య తెలిపారు. శనివారం జనసేన ఆధ్వర్యంలో సామర్లకోట ప్రభుత్వ బహిరంగ సభలో సిఎం జగన్‌ పవన్‌ కళ్యాణ్‌ వ్యక్తిగత జీవితంపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తూ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేకా ఈశ్వరయ్య మాట్లాడుతూ జగన్‌ మహిళలను కించపరిచే విధంగా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో మహిళలే అధికార ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పటానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు ఆకుల రాకేష్‌, జిల్లా కార్యదర్శి గురుజు ఉమామహేశ్వరీ, షేక్‌ పీరు, చింతల నాని, కోరే రంగనాధ్‌, మడకా రవి, సత్తిబాబు, సూరవరపు శేషుకుమార్‌, తదితరులు పాల్గొన్నారు.
     ఉంగుటూరు : పవన్‌ కళ్యాణ్‌ వ్యక్తిగత జీవితంపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయటం సిగ్గు చేటని ఉంగుటూరు నియోజకవర్గ జనసేన వీర మహిళలు అసహనం వ్యక్తం చేశారు. శనివారం ఉదయం నియోజకవర్గ జనసేన కార్యాలయం వద్ద జనసేన వీర మహిళలు, నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చేసిన అభివృద్ధి చెప్పుకోవటానికి ఏమి లేక ప్రతిపక్షాలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు. సిఎం దిగజారుడు వ్యాఖ్యలు సరికాదన్నారు. ప్రభుత్వానికి ప్రజల్లో వచ్చే వ్యతిరేకత చూసి వారిలో భయం పుట్టిందని, జనసేనకి ప్రజల్లో వచ్చే ఆదరణ ఓర్వలేక ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రే ఈ విధంగా మాట్లాడితే ప్రజలకి ఏ సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు మండల జనసేన అధ్యక్షులు పంది రాంబాబు, భీమడోలు మండల జనసేన అధ్యక్షులు ప్రత్తి మధన్‌, వీర మహిళలు చిత్తూరి పార్వతి, అంబటి మాధవి, నిమ్మల మౌనిక, భీమన దుర్గా పల్లవి, వెజ్జు శేషరత్నం, కోటిపల్లి వెంకట పద్మ, తోట ధనలక్ష్మి, తోట శ్రీను, సూరత్తుల అయ్యప్ప, తాడిశెట్టి శివ ప్రసాద్‌, మద్దాల ఉమ పాల్గొన్నారు.