చండీగఢ్ : రానున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పంజాబ్లో అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఆప్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఎన్నికల ప్రచారంలోనూ దూకుడు ప్రదర్శిస్తోంది. తాజాగా పంజాబ్ సిఎం అభ్యర్థిగా భగవంత్ మాన్ను ఖరారు చేస్తూ ఆమ్ఆద్మీ పార్టీ మంగళవారం ప్రకటించింది. ఈ మేరకు మొహాలీలో జరిగిన మీడియా సమావేశంలో ఢిల్లీ సిఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. '93 శాతం మంది భగవంత్ పేరునే సూచించారని, మూడు కోట్ల మంది ప్రజల అభిప్రాయం మేరకే సిఎం అభ్యర్థిగా భగవంత్ మాన్ను ఎంపిక చేశామని' ఆయన అన్నారు. ఇటీవల ఆప్ సిఎం అభ్యర్థి పేరును ప్రతిపాదించాలని కోరుతూ ఓ మొబైల్ నెంబర్ను వెల్లడించిన విషయం తెలిసిందే. ఆ నెంబర్ ద్వారా ప్రజలు తమ ఫీడ్ బ్యాక్ను అందించాలని కోరింది. 96 గంటల్లో 19 లక్షల మంది ఫీడ్ బ్యాక్ పార్టీకి అందిందని ఆప్ నేత హర్పాల్ సింగ్ చీమా తెలిపారు.
కాగా ప్రస్తుతం భగవంత్ మాన్ పంజాబ్ ఆప్ శాఖ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇక పంజాబ్లో ఫిబ్రవరి 20న పోలింగ్ జరగనుంది. మార్చి 10వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.











