Aug 19,2023 21:02

ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్న అధికారులు

 కడప ప్రతినిధి వైద్యో ఆరోగ్య శాఖ రీజినల్‌ కార్యాలయంలో నిశ్శబ్ధం రాజ్యమేలుతోంది. ప్రభుత్వం వైద్య సేవలను మెరుగుపరచడంలో భాగంగా గతేడాది ఆగస్టులో కాంట్రాక్టు పద్ధతిన నర్సింగ్‌ పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగల్‌ ఇచ్చింది. స్టాఫ్‌నర్స్‌ మొదలుకుని ఎంపిహెచ్‌ఒలు ఎంఎల్‌హెచ్‌పి తదితర పోస్టులు ఉన్నట్లు సమాచారం. వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ రీజినల్‌ డైరెక్టర్‌ ఆధ్వర్యంలో దశల వారీగా నర్సింగ్‌ పోస్టులను భర్తీ చేసుకుంటూ వస్తోంది. గత నెల 21, 22 తేదీల్లో 313 స్టాఫ్‌నర్స్‌ పోస్టులను రిక్రూట్‌మెంట్‌ చేసింది. ఎంపికైన కొందరు సరైన పోస్టింగ్‌ లభించక, ఇతర అనివార్య కారణాల రీత్యా విధులకు హాజరు కాలేకపోయిన ఖాళీలతో కలిపి తాజాగా 123 స్టాఫ్‌నర్స్‌ పోస్టుల రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియను చేపట్టింది. రోస్టర్‌ ప్రకారం 15 రోజులు ముందు ఉద్యోగ నియామమకాల వివరాలను నోటీస్‌బోర్డు ద్వారా వెల్లడించాల్సి ఉంది. అనంతరం కౌన్సెలింగ్‌ తేదీని వెల్లడించాలి. ఆర్‌డి కార్యాలయ యంత్రాంగం ఇటువంటి నిబంధనలను గాలికి వదిలేసింది. ఇటువంటి నిబంధనల్లో అభ్యంతరాలు ఏమైనా ఉంటే వెల్లడించాలని కోరాల్సి ఉందనే వాదన వినిపిస్తోంది. ఇటువంటి వాటిని సాధారణ నిబంధనల్ని విస్మరించి నచ్చిన వారిని వాట్సప్‌, మెస్సేజ్‌లు, పోన్‌ల రూపాల ద్వారా పిలుచుకుని ఇష్టారీతిన రిక్రూట్‌మెంట్‌ చేస్తున్నారనే విమర్శలు పెద్ద ఎత్తున ఉన్నాయి. 20 రోజుల కింద ఆన్‌లైన్‌ ద్వారా 22 నుంచి 26 ఖాళీలను భర్తీ చేసినట్లు సమాచారం. ఏ విధానంలో నియామకాలు చేపట్టినప్పటికి నిబంధనలు పాటించకపోవడం విస్మయాన్ని కలిగిస్తోంది. ఆర్‌డి కార్యాలయం అందించే సమాచారం సాంకేతిక అవాంతరాల వల్ల ఆలస్యంగా అందితే ఉమ్మడి కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల నుంచి సకాలంలో కౌన్సెలింగ్‌ హాజరు కావడం అసాధ్యం. ఇటువంటి పరిస్థితుల్లో అర్హులైన వారికి అన్యాయం జరిగే అవకాశం ఉంటుందని ఆందోళన నెలకొంది. ఆర్‌డి కార్యాలయం రిక్రూట్‌మెంట్‌ వ్యవహారాల్లో నిబంధనల్ని గాలికి వదిలేయడం పరిపాటిగా మారింది. ఇటువంటి ఉద్దే శపూర్వక నిర్లక్ష్యం వెనుక మతలబేమిటో తెలియడం లేదనే వాదన వినిపిస్తోంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్‌, వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్లు, ప్రిన్సిపల్‌ సెక్రటరీ వంటి ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని రిక్రూట్‌మెంట్‌ వ్యవహారంలో నిబంధనలు అమలు చేసి నియామకాల్లో పారదర్శకతను పాటించేలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు.