ప్రజాశక్తి - కదిరి టౌన్ : జాతీయ నీట్ ప్రవేశాల కొరకు రాసిన పరీక్ష ఫలితాల్లో రాష్ట్ర స్థాయి ర్యాంక్ సాధించిన సెయింట్ మేరీ స్కూల్ పూర్వపు విద్యార్థులను పాఠశాల యాజమాన్యం తరపున శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఈ మేరకు పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్డువద్ద గల సెయింట్ మేరీ స్కూల్లో గతంలో నర్సరీ నుండి ఏడవ తరగతి వరకు చదివిన విద్యార్థులు ఫైజా సమ్మరియన్ నీట్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 60 ర్యాంక్ సాధించింది. జ్యోతి లాల్ చవాన్ ఆల్ ఇండియా లో 119 వ ర్యాంక్, భువనేశ్వర్ రెడ్డి 2258 మార్కులతో ఆల్ ఇండియా ర్యాంక్ , అభినవ్, మిక్షీప్ నీట్ లో రాణించారు. తమ విద్యాసంస్థలో విద్యను అభ్యసించిన విద్యార్థులు ఇంతటి ఘనవిజయం సాధించడంతో సెయింట్ మేరీ స్కూల్ మేనేజర్ ఫులేమ, ప్రిన్సిపాల్ మెర్సీ అధ్వర్యంలో వారిని సన్మానించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ తమ విద్యాసంస్థలో చదివిన విద్యార్థినీ విద్యార్థులు జాతీయ రాష్ట్రస్థాయిలో మంచి మార్కులు సాధించడం అభినందనీయమన్నారు. తమ సంస్థకు గర్వకారణం అని అన్నారు. నీట్లో రాణించిన విద్యార్థులు మాట్లాడుతూ నర్సరీ నుండి చదువు పట్ల శ్రద్ధ పెట్టి మంచి ఆలోచన విధానాలతో నూతన వరవడిని అందిపుచ్చుకొని ఉన్నత స్థానాలకు చేరేందుకు తమ లక్ష్యానికి అనుగుణంగా ముందుకెళ్లాలన్నారు. అనంతరం యాజమాన్యం తరఫున వారిని సన్మానించి మెమోంటోలు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పవిత్ర, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు










