ప్రజాశక్తి - కొత్తవలస : వికలాంగులకు కృత్రిమ అవయవాలు అందజేసి వారిలో మనోధైర్యాన్ని పెంపోందిస్తూ, వారి కుటుంబాల్లో వెలుగులు నింపుతున్న శ్రీగురుదేవ చారిటబుల్ ట్రస్ట్ సేవలు సేవకే నిర్వచనమని లీడర్ పత్రిక ఎడిటర్ వి.వి.రమణమూర్తి కొనియాడారు. మండలంలోని మంగళపాలెంలో మంగళవారం నిర్వహించిన గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ 25వ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మారుమూల గ్రామంలో 25 ఏళ్ల పాటూ సుమారు 2లక్షలకు పైగా కృత్రిమ ఉపకారణాలను వికలాంగులకు ఉచితంగా అందజేసి, వారి స్వయం ఉపాధికి, వికలాంగుల అభ్యున్నతి కోసం జగదీశ్ ట్రస్ట్ ద్వారా అందిస్తున్న సేవలను రమణమూర్తి అభినందించారు. ఈ ట్రస్ట్ను ఆదర్శంగా చేసుకుని ప్రతి ఒక్కరూ అంకితభావంతో ఎదుటివారికి సహాయపడాలని పిలుపునిచ్చారు. అనంతరం పలువురు వికలాంగులకు ఆయన చేతులమీదుగా కృత్రిమ కాళ్ళు, చేతులు, చెవిటి మిషన్లు, బ్లైండ్ స్టిక్స్, వృద్ధులకు బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ రాపర్తి జగదీశ్ కుమార్, విశ్రాంత రైల్వే ఉద్యోగి స్వామి, లీడర్ ప్రతినిధి ఎల్. శివకుమార్, ట్రస్ట్ వైస్ చైర్మన్ ఫణీంద్ర, గురుదేవ హాస్పటల్స్ సిఇఒ అచ్యుతరామ్మయ్య, డాక్టర్ రాఘవేంద్ర, డాక్టర్ సుజాత, ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.










