Feb 20,2023 23:21

ధర్నానుద్దేశించి మాట్లాడుతున్న సుబ్బారావు

ప్రజాశక్తి -గాజువాక : రాత్రివేళలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు సేఫ్టీ పరికరాలు సరఫరా చేయాలని కోరుతూ గాజువాక జోనల్‌ కార్యాలయం వద్ద జివిఎంసి కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యాన సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్‌ జోన్‌-6 గాజువాక కమిటీ గౌరవాధ్యక్షులు జి.సుబ్బారావు మాట్లాడుతూ, రాత్రి వేళలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు సేఫ్టీ పరికరాలు లేక తరచూ ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు. జాతీయ రహదారిలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు పలుచోట్ల లైటింగ్‌ సదుపాయం లేకపోవడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని పేర్కొన్నారు. రాత్రుళ్లు జాతీయ రహదారులను హైవే చీపింగ్‌ చేసే మిషన్‌తో క్లీనింగ్‌ చేయించాలని, కార్మికులకు యాప్రిన్‌, రేడియం గౌన్లు ఇవ్వాలని, చీపుర్లు, పారలు, సేఫ్టీ పరికరాలు ఇవ్వాలని, తక్షణమే, డెత్‌, సిక్‌ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ ప్రధాన కార్యదర్శి గొలగాని అప్పారావు, ప్రెసిడెంట్‌ గొల్ల రాము, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎస్‌. గణేష్‌, వర్కింగ్‌ సెక్రెటరీ ఎన్‌.నాగరాజు, శ్రామిక మహిళా అధ్యక్షులు బి. మీనాక్షి, ప్యాకేజీ కమిటీ ప్రతినిధులు పద్మ, దివ్య, లక్ష్మి, నాయుడు, తదితరులు పాల్గొన్నారు.