Aug 12,2023 17:25

ప్రజాశక్తి - వీరవాసరం
           ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో పండించిన ఆహారాన్ని తినడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని జిల్లా కో-ఆర్డినేటర్‌ అరుణకుమారి అన్నారు. నవడూరులో రైతు భరోసా కేంద్రం వద్ద సీడ్‌2సీడ్‌ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణకుమారి మాట్లాడుతూ కాండం తొలుచు పురుగులను నివారించడానికి రైతులు పొలాల్లో లింగాకర్షన బుట్టలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. కోడిగుడ్డు, నిమ్మరసం కలిపిన మిశ్రమం పంట ఎదుగుదలకు పని చేస్తుందన్నారు. వేప పిండి కషాయం పంటను నాశనం చేసే గుడ్డు ముద్దలను నాశనం చేస్తుందన్నారు. వరిలో ప్రధానంగా వచ్చే తెగుళ్లు, పురుగుల నివారణపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యమ్రంలో డివిజన్‌ ఇన్‌ఛార్జి స్వామి, మండల ఇన్‌చార్జి దేవినాగరాజు, రవికుమార్‌, వినోద్‌కుమార్‌, దుర్గారావు పాల్గొన్నారు.