Apr 25,2023 19:24

సీమంతంలో పాల్గొన్న సర్పంచి, ఐసిడిఎస్‌ సూపర్‌వైజర్‌

ప్రజాశక్తి - చిప్పగిరి
గర్భిణులు, బాలింతలకు ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పౌష్టికాహారం, ఆరోగ్యపరంగా ఎప్పటికప్పుడు నిర్వహిస్తున్న పరీక్షల వంటి సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సర్పంచి నీలకంఠ, ఐసిడిఎస్‌ సూపర్‌వైజర్‌ ప్రసూన సూచించారు. మంగళవారం డేగలహాల్‌ గ్రామంలో పంచాయతీ కార్యదర్శి నరసింహులు, సూపర్‌వైజర్‌ ప్రసూన ఆధ్వర్యంలో గర్భిణులకు సీమంతం వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గర్భిణులకు, బాలింతలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చి రక్తహీనతకు గురికాకుండా బలవర్థకమైన ఆహారం అందిస్తోందని తెలిపారు. ఆరోగ్యపరంగా ఎప్పటికప్పుడు విలేజ్‌ వైద్యాధికారి చేత ఆరోగ్య సూచనలు పాటించేలా చూస్తోందన్నారు. ప్రసవం అయ్యేంత వరకు వైద్యాధికారి సూచనలు పాటించాలని మహిళలకు తెలిపారు. అంగన్వాడీ టీచర్‌ భారతి, ఆయా, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.