సచివాలయంలో తనిఖీ
ప్రజాశక్తి-బిట్రగుంట : బోగోలు మండలం పరిధిలోని ఎస్విపాలెం గ్రామ సచివాలయంలో డివిజనల్ అభివృద్ధి అధికారి కనకదుర్గ భవాని స్థానిక ఎంపిడిఒ వెంకట సుబ్బారావుతో కలిసి బుధవారం తనిఖీ చేశారు. గురువారం జరిగే జగనన్న సురక్ష కార్యక్రమంపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజనల్ అభివృద్ధి అధికారి కనకదుర్గ భవాని మాట్లాడుతూ జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని, ప్రజలకు అవసరమైన 11 రకాల సర్టిఫికెట్లను ఎటువంటి రుసుము లేకుండా ఇస్తున్నారని, ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని సర్టిఫికెట్లు పొందవచ్చన్నారు. గ్రామంలోని ఎస్టి కులానికి చెందిన లబ్ధిదారులతో మాట్లాడి ఆధార్ ఉపయోగం గురించి వారికి అవగాహన కల్పించామని, ప్రతి ఒక్కరూ ఆధార్ తప్పనిసరిగా తీసుకొని తద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకములు అందుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు ప్రజలు పాల్గొన్నారు.










