సచివాలయ వ్యవస్థ పటిష్టతకు కృషి
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్భన్ : గ్రామాల్లో సచివాలయ వ్యవస్థ పటిష్టంగా ఉండే విధంగా పంచాయతీ కార్యదర్శులు సిబ్బంది తమ విధులపై భాధ్యతగా వ్యవహరించాలని ఎంపిడిఒ సి.శ్రీనివాసులు తెలియజేశారు. బుధవారం ఆయన మండలంలోని నువ్వురుపాడు సచివాలయంను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయంలోని పలు రికార్డులను పరిశీలించారు. ప్రస్తుతం సిబ్బంది సర్వీసులు క్రమబద్ధీకీరించనందున, జీతాల బిల్ రిజిస్టర్, లీవు రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించాలని ఆయన సూచించారు. ప్రతి ఒక్కరూ ఆన్ డ్యూటీపై బయటకు పోయినపుడు తప్పనిసరిగా మూవ్మెంట్ రిజిస్టర్లో నమోదు చేయాలని, ప్రతిరోజూ మధ్యాహ్నం 3గంటల నుంచి 5గంటల వరకు స్పందన కార్యక్రమం తప్పనిసరిగా నిర్వహించి వాటిని ఎప్పటకప్పుడు పరిష్కరించాలని ఆయన తెలిపారు. తదుపరి రైతు భరోసా కేంద్రంను పి.ఎం.యాప్ ద్వారా తనిఖీ చేశారు. నూతనంగా నిర్మిస్తున్న సచివాలయం, రైతు భరోసా కేంద్ర నిర్మాణాలను పరిశీలించారు. వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ సరైన స్థలాన్ని గుర్తించి వెంటనే పనుల ప్రారంభానికి కృషి చేయాలన్నారు. అలాగే ఆగిపోయిన ఎస్డబ్ల్యుఎం నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని గ్రామ సర్పంచ్ను, ఇంజనీరు సహాయకులు రాజశేఖర్ను కోరారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి లక్ష్మి ప్రసన్న, అగ్రికల్చరల్ సహయకురాలు ప్రవల్లిక, డిజిటల్ అసిస్టెంట్ వినీల్, తదితరులు పాల్గొన్నారు.










