
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: కార్తీక మాసంలో పంచారామ క్షేత్రాలు, శబరిమలకు వెళ్లే యాత్రికుల సౌకర్యార్థం ఆర్టిసి ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి ఎ.విజరు కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. శబరిమలకు వచ్చే ఏడాది జనవరి 20వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు పేర్కొన్నారు. పంచారామ క్షేత్రాలకు ఈనెల 19, 26, డిసెంబరు 3, పదో తేదీల్లో పలాస, టెక్కలి, శ్రీకాకుళం డిపోల నుంచి ప్రత్యేక బస్సులు బయలుదేరుతాయని తెలిపారు. ఇందుకోసం సూపర్లగ్జరీ, ఆల్ట్రా డీలక్స్, ఎక్స్ప్రెస్ బస్సులు అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. ఈ ప్రత్యేక బస్సులకు ముందస్తు రిజర్వేషన్ సదుపాయం కల్పించినట్లు తెలిపారు. ప్రతి ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు బస్సు బయలుదేరి సోమవారం ఐదు క్షేత్రాలను దర్శింపజేసి, మంగళవారం ఉదయం ఆరు గంటలకు గమ్యస్థానానికి చేరుస్తామని వివరించారు. పూర్తిగా బస్సు బుక్ చేసుకున్న వారి ఇంటి వద్దకే పంపిస్తామని తెలిపారు. శబరిమల యాత్రికుల కోసం ఏడు రోజులు, 11 రోజుల యాత్రకు బస్సులు నడుపుతున్నట్టు తెలిపారు. మరిన్ని వివరాలకు శ్రీకాకుళం ఒకటో డిపో మేనేజర్ 9959225608, అసిస్టెంట్ మేనేజర్ (ట్రాఫిక్) 7095040608, రెండో డిపో మేనేజర్ 9959225609, అసిస్టెంట్ మేనేజర్ (ట్రాఫిక్) 7382917289, టెక్కలి డిపో మేనేజర్ 959225611 అసిస్టెంట్ మేనేజర్ (ట్రాఫిక్) 7382923311, పలాస డిపో మేనేజర్ 9959225610 అసిస్టెంట్ మేనేజర్ (ట్రాఫిక్) 7382924758 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.