ప్రజాశక్తి-అనకాపల్లి
ప్రజలకు అందుబాటులో ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని జాతీయ రహదారి వద్దకు మార్చేందుకు చేస్తున్న నిర్ణయాన్ని తక్షణమే నిలిపివేయాలని కోరుతూ అఖిలపక్షాల ఆధ్వర్యంలో స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ, ఆమ్ ఆద్మీ, నేషనల్ కో ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ నాయకులు మాట్లాడుతూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే ప్రాంతంలోనే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని కొనసాగించాలని కోరారు. జాతీయ రహదారి బైపాస్ రోడ్లోకి మార్చడం వల్ల వృద్ధులు, వికలాంగులు, దూర ప్రాంతాల నుంచి వచ్చే రైతులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడమే కాక దొంగతనాలు జరిగే ప్రమాదం ఉందని తెలిపారు. తక్షణమే కార్యాలయ తరలింపును ఉపసంహరించుకొని ప్రజలకు అన్ని కార్యాలయాలు బ్యాంకులు అందుబాటులో ఉండే ప్రాంతంలో ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు వైఎన్ భద్రం, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కొణతాల హరినాథ్ బాబు, నేషనల్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ నాయకులు సూదికొండ మాణిక్యాలరావు, చెల్లూరి నాగరాజు, సిహెచ్ శ్రీనివాసరావు బాబ్జి, రమణ, కోరిబిల్లి శంకర్రావు, కొణతాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.










