ప్రజాశక్తి - గోనెగండ్ల
సామాజిక స్పృహ కలిగిన ఉపాధ్యాయ సంఘంగా మెరుగైన సమాజం కోసం పాటుపడుతూ సామాజిక బాధ్యతలను నెరవేర్చడంలో యుటిఎఫ్ ముందుంటుందని యుటిఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షులు కె.సురేష్ కుమార్ తెలిపారు. యుటిఎఫ్ గోనెగండ్ల మండల అధ్యక్షులు రామన్ ఆధ్వర్యంలో పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు ఆంగ్లం, గణితంలో ఉన్నతంగా రాణించాలని గోనెగండ్ల బస్టాండ్ పాఠశాలలో ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్, గణిత తరగతులను శనివారం ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా సురేష్ కుమార్, యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జె.ఎల్లప్ప, జయరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సామాజిక స్పృహలో భాగంగా గోనెగండ్ల మండలంలోని విద్యార్థులు ఇంగ్లీష్, గణిత భాషల్లో మెళకువలు నేర్చుకుని మంచి పట్టు సాధించి వారి భవిష్యత్తుకు మంచి పునాది వేసుకోవడానికి ఈ శిక్షణ తరగతులు చాలా చక్కగా ఉపయోగపడతాయని తెలిపారు. వేసవి సెలవుల్లో పదేళ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో అనుభవం ఉన్న ఉపాధ్యాయుల చేత బోధింప పడుతున్న ఈ శిక్షణ తరగతులను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ శిక్షణ తరగతులకు 60మంది పైగా రిజిస్టర్ చేసుకున్నారని తెలిపారు. మిగిలిన విద్యార్థులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి నరసింహులు, నాయకులు శంకర్ నాయక్, రాముడు, నాగేశ్వరరావు, జిక్రియా, గుమ్మల బాబు, హుస్సేన్, లింగన్న, నాగరాజు, ఖలీల్, ఎస్ఎఫ్ఐ నాయకులు వీరన్న, ఖాజా, నంది పాల్గొన్నారు.
మాట్లాడుతున్న సురేష్ కుమార్