శాఖాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం- ఎమ్మెల్యే కాటసాని
ప్రజాశక్తి - బనగానపల్లె
శాఖాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం, ఆనందమని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం పిరమిడ్ ధ్యాన కేంద్రం వారి ఆధ్వర్యంలో శాఖాహార దినోత్సవం సందర్భంగా పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయం నుంచి పోలీస్ స్టేషన్, జిఎం టాకీస్, ఆస్థానం రోడ్, పాత బస్టాండ్ మీదుగా మంగళవారం పేటలోని పిరమిడ్ ధ్యాన కేంద్రం వరకు శాఖాహారులు భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాటసాని రామిరెడ్డి ర్యాలీలో పాల్గొని శాఖాహారులకు తమ సంపూర్ణ మద్దతును తెలిపారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయ ఆవరణంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడ శాఖాహారులను ఉద్దేశించి సభను నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ శాఖాహారంతోనే మనిషికి సంపూర్ణ ఆరోగ్యము, ఆనందం కలుగుతుందని తెలిపారు. ఈ కంప్యూటర్ యుగం లో మనిషి తప్పనిసరిగా ధ్యానం ను అలవాటు చేసుకోవాలని, వాటి వల్ల మనిషి ఒత్తిడికి లోను కాకుండా ఆనందంగా ఉంటరని తెలిపారు. మనిషి ఆరోగ్యంగా ఆనందంగా ,విజ్ఞానంగా జీవనాన్ని కొనసాగించాలంటే శాఖాహారంతో పాటు ధ్యానము, యోగ పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం 159 రకాల ప్రాణాంతక రోగాలకు కేవలం మాంసాహారమే కారణమని స్పష్టం చేయడం జరిగిందని తెలిపారు. శాఖాహారం వల్ల శరీర ఆరోగ్యానికి మానసిక సమతుల్యత, బుద్ధి వికాసానికి ఎంతో తోడ్పాటు అందించడం జరుగుతుందని చెప్పారు. మనుషులు విద్యార్థులు పిరమిడ్లను ఇంట్లోనూ ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి తగ్గి ఏకాగ్రత పెరిగి జ్ఞాపక శక్తి కూడా అభివృద్ధి చెందునని చెప్పారు. తాను కూడా ఫిబ్రవరి నెల నుంచి శాఖాహారంగా మారానని తమ ఇంటిలో కూడా త్వరలోనే పిరమిడ్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు గాదం శెట్టి వేణుగోపాల్, డాక్టర్ గాదం శెట్టి రామనాథ్, డాక్టర్ రవి కుమార్, కిషోర్, టీచర్ ప్రభాకర్ రెడ్డి, మారుతి షోరూం యజమాని గుండా రవికుమార్, గుండా సుప్రజా లతోపాటు పెద్ద సంఖ్యలో పిరమిడ్ ధ్యాన కేంద్రం సభ్యులు,మహిళలు పాల్గొనడం జరిగింది.










