ప్రజాశక్తి - కౌతాళం
తుంగభద్ర దిగువ కాలువ సాగునీటిపై టిడిపి నాయకులు తిక్కారెడ్డి అసత్య ప్రచారాలు మానుకోవాలని వైసిపి మండల కన్వీనర్ దేశాయి ప్రహ్లాద చారి, మండల నాయకులు ఏకం రెడ్డి తెలిపారు. గురువారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వర్షాభావ పరిస్థితుల వల్ల కొంతవరకు నీటి సమస్యలున్నా ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సహకారంతో రైతుకు సాగునీరు అందుతోందని తెలిపారు. దిగువ కాలువ పరిధిలోని ఆయా డిస్ట్రిబ్యూటర్ల ఆయకట్టు రైతులకు వంతుల వారీగా సాగునీరు అందిస్తున్నామని చెప్పారు. ఎక్కడో బండపై ఎండిపోయిన పంటను చూపించి అసత్య ప్రచారం చేయడం తిక్కారెడ్డికే చెల్లిందన్నారు. కేవలం కొంతమంది రైతులతో నిరసన చేసి రైతుల కోసమని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి పిలుపునిస్తే ఎంతమంది రైతులు వస్తారో ప్రజలకు బాగా తెలుసన్నారు. పార్టీలకతీతంగా రైతులకు సాగునీరందించే ఘనత ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికి చెందుతుందని తెలిపారు. గత టిడిపి ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి వందలాది రైతుల ఆధ్వర్యంలో తుంగభద్ర కాలువపై పర్యటించి బళ్లారిలోని బోర్డు కార్యాలయంలో అధికారులతో చర్చించి సాగునీరు తీసుకొచ్చారని చెప్పారు. కాలువపై కూర్చొని భోజనాలు చేస్తే రైతులకు సాగునీరు రావని, సంబంధిత అధికారులతో పోరాడితే వస్తాయని తెలిపారు. రైతుల కోసం 24 గంటలు పని చేసే బాలనాగిరెడ్డిపై విమర్శలు ఆపి ప్రజలకు ఎలా దగ్గర కావాలో ఆలోచించుకోవాలని సూచించారు. వైస్ ఎంపిపి బుజ్జి స్వామి, సర్పంచి పాల్ దినకరన్, బంటకుంట సర్పంచి గోపాల్ రెడ్డి, వైసిపి నాయకులు హాల్వి చెన్నప్ప, అబ్దుల్ సమద్, హుసేని, శివరాం, మల్లయ్య, వెంకన్న, సిద్ధ రామ పాల్గొన్నారు.
కౌతాళంలో మాట్లాడుతున్న వైసిపి నాయకులు