ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: జిల్లాలో వ్యవసాయ సీజన్ ప్రారంభానికి ముందుగానే సాగునీటి కాలువ పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్బాషా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పంట కాలువలను అభివృద్ధి పనులు చేయడానికి రూ.23 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. త్వరలో కాలువల అభివృద్ధి పనులు పూర్తి చేయాలన్నారు. జిల్లాలో రైతులకు రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇన్ ఫుట్ సబ్సిడీ ఇవ్వాలని ఆయన చెప్పారు. రైతులు పండించిన శనగలు, కందులను కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలన్నారు. జిల్లాలో రైతులు పండించిన పంటలకు ఆర్బికెల ద్వారా మద్దతు ధర కల్పిస్తామని ఆయన చెప్పారు. జిల్లాలో రైతులు వేసిన పంటలకు ఇ క్రాప్ నమోదు చేయాలన్నారు. నమోదు చేసిన ఇ క్రాప్ నమోదును వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మీ శివ జ్యోతి, వ్యవసాయ శాఖ జెడి అబ్దుల్ సత్తార్, పశుసంవర్ధక శాఖ జెడి హనుమంతరావు, మత్స్య శాఖ జెడి సురేష్, ఉద్యానవన శాఖ ఎడి జెన్నెమ్మ, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.










