
ప్రజాశక్తి-గుంటూరు : స్థానిక ఆర్.అగ్రహారంలోని రాజరాజేశ్వరి ట్రేడర్స్ షాపులో వ్యవసాయ అధికారులు సోమవారం తనిఖీలు నిర్వహించారు. పలు రకాల ఎరువులు, బయోస్టిములెంట్స్ను లైసెన్స్ లేకుండా, జి2, జి3 అనుమతి పత్రాలు లేకుండా షాపు ప్రొప్రైటర్ ఉన్నం ప్రసాదరావు విక్రయాలు చేపడుతున్నట్లు గుర్తించారు. వాటిల్లో కోబ్రా, పాంటాక్ ప్లస్, సూపర్ స్మాష్, జింగిల్, సైరా, కాలిన్, డైకోరస్, ఎక్టివెట్, అపోలో, నియోమైట్ తదితర పేర్లతో ఉన్న బయోఉత్పత్తులను గుర్తించారు. 843 కిలోలున్న వీటి విలువు సుమారు రూ.16,30,171 ఉంటుందని అధికారులు తెలిపారు. అనుమతి లేని స్టాకును స్వాధీనం చేసుకొని 420 కేసు నమోదుకు స్థానిక లాలాపేట పోలీసు స్టేషన్ వారికి అప్పగించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ గుంటూరు సహాయ సంచాలకులు జె.శ్రీనివాసరావు, గుంటూరు అర్బన్ వ్యవసాయాధికారులు బి.కిషోర్, బి.అంజిరెడ్డి పాల్గొన్నారు.