ప్రజాశక్తి - పెద్దకడబూరు
జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ నార్మ్, కర్నూలు జిల్లా వ్యవసాయ శాఖ తరపున ఎస్సీ సబ్ ప్లాన్ 2022-23 పథకం కింద పెద్దకడబూరు గ్రామంలోని 323 మంది ఎస్సీ రైతులకు వ్యవసాయ ఉపకరణాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నార్మ్ శాస్త్రవేత్తలు డాక్టర్ ఎం.రమేష్ నాయక్ మాట్లాడారు. 2022-23 సంవత్సరం ఎస్సీ సబ్ప్లాన్ కింద ఎస్సీ రైతులకు వ్యవసాయ పనిముట్లు అందజేస్తున్నట్లు తెలిపారు. గ్రామ రైతులు సహకరిస్తే ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు మరిన్ని చేపడతామని చెప్పారు. వైసిపి రాష్ట్ర యువజన విభాగం నాయకులు వై.ప్రదీప్ రెడ్డి మాట్లాడారు. నార్మ్ సంస్థ వారు వెనుకబడిన ప్రాంతాలను గుర్తించి ఎస్సీ రైతులకు వ్యవసాయ ఉపకరణాలు అందించడం ఆనందించదగ్గ విషయమన్నారు. ఎస్సీ రైతుల అభివృద్ధి కోసం ఇలాంటి ప్రణాళికలను మరిన్ని సిద్ధం చేయాలని వ్యవసాయ అధికారులను కోరారు. నార్మ్ చీఫ్ టెక్నికల్ అధికారులు డాక్టర్ విజయేంద్ర రెడ్డి, శేఖర్ రెడ్డి, నాందేవ్, జిల్లా వ్యవసాయ అధికారి పిఎల్.వరలక్ష్మి, ఆదోని సహాయ వ్యవసాయ సంచాలకులు ఎం.గిరీష్, ఎఒ ఎం.వర ప్రసాద్, మండల వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ పురుషోత్తం రెడ్డి, వైసిపి మండల కన్వీనర్ బి.రామ్మోహన్ రెడ్డి, నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, రవి చంద్రారెడ్డి, రఘురాముడు పాల్గొన్నారు.
పనిముట్లను పంపిణీ చేస్తున్న నాయకులు, శాస్త్రవేత్తలు










