
ప్రజా రక్షణ భేరి ప్రచారం
విజయవాడ : రష్యన్ విప్లవ దినోత్సవం సందర్భంగా నగరంలోని కాట్రగడ్డ శ్రీనివాసరావు భవన్ వద్ద సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంగళవారం జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్ విప్లవ పోరాటం సామ్రాజ్య వాద దోపిడీని ఎదిరించడంతో పాటు, వలస దేశాలకు విముక్తిని సాధించిందన్నారు. పాలస్తీనాపై జరుగుతున్న దాడి చూస్తే ఎంత మోసపూరితమో అర్థమవుతోందన్నారు. దేశ సంపదను పెట్టుబడిదారులకు కట్టబెట్టేందుకు బిజెపి పూనుకుందన్నారు. ప్రజలపై వివిధ భారాలు మోపుతుందన్నారు. ఇలాంటి ప్రజా సమస్యల పరిష్కారానికి అసమానతలు లేని అభివృద్ధికి సిపిఎం ప్రజా రక్షణ భేరి 15న తలపెట్టిందని ఆయన తెలిపారు. ప్రజలంతా దీనికి మద్దతివ్వాలని కోరారు. 61వ డివిజన్లో బాబూరావు పాల్గొని 15న ప్రజారక్షణ భేరి సభను జయప్రదం చేయాలని కోరారు. సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో పిఎన్ బస్స్టేషన్ వద్ద సిఐటియు జెండాను వెంకటేశ్వరరావు, సిపిఎం జెండాను యూనియన్ గౌరవాధ్యక్షులు దోనేపూడి కాశీనాద్ ఆవిష్కరించారు. అనంతరం ఆటో కార్మికుల జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సంందర్భంగా కాశీనాధ్ మాట్లాడుతూ... కార్మికుల హక్కుల కోసం పోరాడుతున్న సిపిఎం ఆధ్వర్యంలో ఈనెల 15న సింగ్నగర్ మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో జరిగే ప్రజారక్షణ భేరి సభలో ఆటో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 58, 59వ డివిజన్లలోని లెనిన్ సెంటర్లో రష్యా విప్లవం పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం డివిజన్ కార్యదర్శి ఎస్కె నిజాముద్దీన్, సెంట్రల్ సిటీ కార్యదర్శి భూపతి రమణారావు, పార్టీ బాధ్యులు మూర్తి, నాగార్జున, మురారి హాజరయ్యారు. చందర్లపాడు : మండల కేంద్రమైన చందర్లపాడులోని స్థానిక బస్టాండ్ సెంటర్లో ఈ నెల 15వ తేదీన విజయవాడలో జరుగుతున్న సిపిఎం ప్రజా రక్షణ భేరి బహిరంగ సభ గోడపత్రికల ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు చనుమోలు సైదులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం చందర్లపాడు శాఖ కార్యదర్శి షేక్ హస్సాన్, సిపిఎం నాయకులు వేల్పుల ఏసోబు పాల్గొన్నారు. వత్సవాయి : వత్సవాయి మండలంలో వివిధ గ్రామాలలో ప్రచార జాత కార్యక్రమం నిర్వహించారు. మండల కమిటీ సభ్యులు రాయల సుదర్శనం పార్టీ జెండా ఊపి జాతా ప్రారంభించగా సీనియర్ నాయకులు చిరుమామిళ్ల హనుమంతరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు తమ్మినేని రాంబాబు, మండల కమిటీ సభ్యులు కంచర్ల కొండయ్య పాల్గొన్నారు. జగ్గయ్యపేట: మండలంలోని షేర్ మహమ్మద్ పేట గ్రామంలో మంగళవారం ప్రజారక్షణభేరి బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం సీనియర్ నాయకులు కోటా కృష్ణ, దంతాల వెంకటేశ్వర్లు మాట్లాడారు. బహిరంగ సభకు అఖిల భారత కార్యదర్శి సీతారాం ఏచూరి, రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు జుజ్జువరపు వెంకటరావు పాల్గొన్నారు. కంచికచర్ల : ప్రజా రక్షణ భేరి బహిరంగ సభను జయప్రదం చేయాలని సిఐటియు ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.సిహెచ్.శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మంగళవారం కంచికచర్లలో మార్కెటింగ్ యార్డు పిహెచ్సి ఆశా, ఆటో, రిక్షా, అంగన్వాడీ ఇతర రంగాల్లో గ్రూపు మీటింగులు నిర్వహించి ప్రజా రక్షణ భేరి బహిరంగ సభ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కోట కళ్యాణ్, సిఐటియు నాయకులు పాల్గొన్నారు నందిగామ : నందిగామలో 18వ వార్డులో నవంబర్ 15 సిపిఎం ప్రజా రక్షణ భేరి సభను జయప్రదం చేయాలని మంగళవారం ప్రచార జాతా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నందిగామ కార్యదర్శి కె.గోపాల్ మాట్లాడుతూ ప్రమాదంలో పడిన మన రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవాల్సిన బాధ్యత సామాన్య ప్రజలపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సయ్యద్ ఖాసిం, తదితరులు పాల్గొన్నారు. వీరులపాడు: ప్రజారక్షణ భేరి బహిరంగ సభ వాల్పోస్టర్ను అల్లూరులో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా సెక్రటేరియట్ సభ్యులు కె.కళ్యాణ్, కమిటీ సభ్యులు గుంజి వీరయ్య, తదితరులు పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం : సోవియట్ రష్యా విప్లవం 1917లో జయప్రదమైన కార్మిక వర్గ రాజ్య స్థాపన వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సిపిఎం స్థూపం వద్ద జెండా ఆవిష్కరించారు. సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కొండపల్లి స్టేషన్ సెంటర్ కొల్లి ఆదినారాయణ వీధిలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపియం సీనియర్ నాయకులు ఎ.విఠల్ రావు, మాజీ సర్పంచ్ కొల్లి వెంకటేశ్వరరావు జెండా ఆవిష్కరించగా కొండపల్లి టౌన్ కమిటీ కార్యదర్శి ఎం.మహేష్ మాట్లాడారు.