ప్రజాశక్తి-సీతమ్మధార : రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రోడ్లు పరిస్థితి దారుణంగా ఉందని జనసేన ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త పసుపులేటి ఉషాకిరణ్ ఆరోపించారు. 25వ వార్డు జనసేన అధ్యక్షుడు సమ్మెట్ల వెంకటేష్ ఆధ్వర్యాన గుడ్ మార్నింగ్ సిఎం సార్ నినాదంతో ఆదివారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పసుపులేటి ఉషాకిరణ్ హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో రోడ్లు గుంతలుగా ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిచి రోడ్లు బాగుచేయాలని కోరారు. సమ్మెట్ల వెంకటేష్ మాట్లాడుతూ, ఉత్తర నియోజకవర్గంలో రోడ్లన్నీ మరమ్మతులు చేపట్టాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నాగమణి, శ్రీధర్, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.










