Oct 30,2023 00:47

రోడ్డుపై డ్రమ్ములు ఏర్పాటు చేస్తున్న పోలీసులు

ప్రజాశక్తి-ముంచంగిపుట్టు:మండల పరిధిలో అత్యధికంగా వాహన చోదకులు ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు స్థానిక ఎస్సై కె.రవీంద్ర పేర్కొన్నారు. ఆదివారం పాడేరు నుండి ముంచింగిపుట్టు వెళ్లే ఆర్‌అండ్బి ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణ, వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు మండలంలో గల కుజబంగి, కొత్తూరు కూడళ్ల వద్ద పోలీసులు వేగాన్ని నియంత్రించే డ్రమ్ములు ఏర్పాటు చేసి రేడియం స్టిక్కర్లను అతికించారు. ఈ సందర్భంగా ఎస్సై కె.రవీంద్ర మాట్లాడుతూ వాహనాల వేగాన్ని నియంత్రించి రొడ్డు ప్రమాదాలు అరికట్టేందుకు పోలీసు శాఖ ద్వారా ప్రత్యేక చర్యలు తీసుకొంటున్నామని అన్నారు. నిత్యం ప్రమాదాలు జరిగే ప్రదేశాల్లో వేగం నివారణ సూచిక డ్రమ్ములు ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. అలాగే వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపరాదని, మితిమీరిన వేగంతో వెళ్లరాదని సూచించారు. రాంగ్‌ రూట్‌ లో వాహనాలు నడపొద్దని వాహనదారులకు ఆయన కోరారు. అలాగే మైనర్లకు వాహనాలు ఇస్తే యాజమానిపై కేసులు సైతం నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు పాల్గొన్నారు.