
ప్రజాశక్తి-ఆనందపురం : ఆనందపురం- బోని రోడ్డులో చందక జంక్షన్ వద్ద రహదారి మధ్యలో ఏర్పడిన నీటి గుంత వల్ల వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ రహదారిలో నిత్యం వాహనాలు తిరుగుతూ ఉంటాయి. ప్రతిరోజు రైతులు వేకువ జామున ఆటోలు, బైకులపై మార్కెట్కు కూరగాయలు తెస్తుంటారు. రాత్రి వేళలో ప్రయాణాలు సాగించేటప్పుడు ఈ గుంతను గమనించలేక తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు వేసేటప్పుడు ఈ ప్రాంతంలోని నీరు పోవడానికి కల్వర్టు ఏర్పాటు చేయకుండా వదిలి వేయడంతో నీటి నిల్వలు పెరిగి గుంతగా మారింది. ఈ రోడ్డు గుండా ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగము ప్రయాణిస్తున్నా చూచీచూడనట్టు వ్యవహరిస్తుండటంతో చందక గ్రామస్తులు, వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి ఈ గుంతను పూడ్చి ఎగువ నుంచి వచ్చే నీరు పోవడానికి దారిర చూపించాలని గ్రామస్తులు కోరుతున్నారు.