ప్రజాశక్తి-కొత్తకోట:రావికమతం మండలం గంపవాని పాలెం గ్రామంలో రహదారి ఆక్రమణపై స్పందనలో వచ్చిన ఫిర్యాదు పై కొత్తకోట ఎస్సై విభూషణరావు, జడ్.బెన్నవరం వీఆర్వో దేవకాంత సంఘటనా స్థలంలో గురువారం విచారణ చేపట్టారు. తమ ఇళ్లకు రాకపోకలు సాగించే పంచాయతీ రహదారిని స్థానిక విఆర్పి రొంగలి ఉమా, ఆమె భర్త రమణ, మరో ఇద్దరు రొంగలి రాజబాబు, స్వామి తదితరులు ఆక్రమణ చేశారంటూ స్పందనలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలకు గ్రామానికి చెందిన మాకిరెడ్డి రమణ ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ, విఆర్ఓ విచారణ చేపట్టారు. విచారణకు విఆర్పి కుటుంబ సభ్యులు హాజరు కాలేదని, రహదారి ఆక్రమణ జరిగిందని విచారణలో తేలిందని, వారి వద్ద పత్రాలు ఏమైనా ఉంటే చూపాలని నోటిస్ జారీ చేశామన్నారు. రెండు రోజుల్లో సరైన సమాధానం ఇవ్వకుంటే జిల్లా అధికారులకు సమస్య పై నివేదిక అందజేస్తామని విఆర్ఓ పేర్కొన్నారు.










