జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్
ప్రజాశక్తి -పాడేరు : సమాజ శ్రేయస్సుకు రక్తదానం ఎంతో దోహద పడుతుందని జిల్లా కలెక్టర్ సుమిత్కుమార్ అన్నారు. రక్తదానానికి యువత ముందుకు రావాలని పిలపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశమందిరంలో ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిర్దిష్టమైన షెడ్యూల్ రూపొందించి జిల్లావ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహించి, దాతలనుంచి రక్తం సేకరించాలని సూచించారు. డిగ్రీ కళాశాలలలో ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. దీనికి సంబంధించి కళాశాలల ప్రిన్సిపాల్స్కు డిఇఒ లేఖ రాయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. సేకరించిన రక్తాన్ని జిల్లా కేంద్ర ఆసుపత్రి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అవసరాలకు సరఫరా చేయాలని కోరారు. ముందుగా డిఆర్ఒ బి. దయానిధి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. డిఆర్ఒ సూచనల మేరకు సబ్ ట్రెజరీ అధికారి ఎంవి.ఆర్ ప్రసాద్తో సహా పలువురు ఉద్యోగులు శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. 20 యూనిట్లు రక్తాన్ని సేకరించారు. కార్యక్రమంలో రెడ్క్రాస్ వైస్చైర్మన్ ఎస్.గంగరాజు, కార్యదర్శి ఈశ్వరరావు, కోశాధికారి అప్పారావు, కోఆర్డినేటర్ కోటేశ్వరరావు, సభ్యులు సూర్యారావు, సుబ్రహ్మణ్యం, లోహితాస్, గౌరీ శంకర్, మర్ల మణి, వైద్యాధికారిని డాక్టర్ జి.రూపకళ, దనరాజ్, టెక్నికల్ సిబ్బంది, రాజుబాబు, రాజు, అప్పారావు, సతీష్, వెంకట్ పాల్గొన్నారు.










