Aug 02,2021 15:31

ముంబయి : పూర్తి  సమాచారం లేకుండా కామెంట్లు చేయవద్దని  బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి కోరారు. రాజ్‌కుంద్రా అరెస్ట్‌పై  ఆమె ట్విటర్‌ వేదికగా స్పందించారు. ఒకరిపై ఫిర్యాదు  చేయవద్దు, అలాగే వివరించవద్దు అనేది తన తత్వమని ..  భారత న్యాయవ్యవస్థపై తనకి పూర్తి నమ్మకం ఉందని చెప్పారు. గత కొన్నిరోజలుగా ప్రతి విషయంలోనూ తాను ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నానని, రాజ్‌కుంద్రా అరెస్ట్‌ వ్యవహరంపై ఎన్నో పుకార్లు, ఊహాగానాలు వస్తున్నాయని అన్నారు. మీడియాతోపాటు బంధువులు కూడా తనను, తన కుటుంబాన్ని నిందిస్తూ.. ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు.  రాజ్‌కుంద్రా అరెస్ట్‌పై ఇప్పటివరకు స్పందించలేదని, ప్రస్తుతం కేసు విచారణలో దశలో ఉన్న కారణంగా ఆ విషయంపై తాను మాట్లాడాలనుకోవడం లేదని అన్నారు. ముంబయి పోలీసులు, భారత న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని, అలాగే, దయచేసి తన గురించి అసత్య ప్రచారాలు చేయవద్దని, కథనాలు సృష్టించవద్దని ట్వీట్‌ చేశారు. ఒక తల్లిగా తన పిల్లల భవిష్యత్తును దృష్టిలో  ఉంచుకోవాలని.. పూర్తి సమాచారం లేకుండా కామెంట్లు చేయవద్దని శిల్పాశెట్టి ట్విటర్‌లో పేర్కొన్నారు. కాగా, పోర్న్‌ కేసులో రాజ్‌కుంద్రాను జులై 19న ముంబయి క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్నారు.