Feb 20,2023 23:20

కిడ్నాప్‌ కేసు వివరాలు వెల్లడిస్తున్న సిపి శ్రీకాంత్‌

ప్రజాశక్తి - ఎంవిపి.కాలనీ : డబ్బుల కోసం ఎంతకైనా తెగిస్తామనే జాబితాలో ఇద్దరు కానిస్టేబుళ్లు చేరిపోయారు. రౌడీషీటర్‌తో కలిసి ఓ బిల్డర్‌ని కిడ్నాప్‌ చేసి డబ్బు గుంజిన కేసులో అడ్డంగా వారు దొరికిపోయారు. బాధితుని ఫిర్యాదు మేరకు విశాఖలోని పిఎం.పాలెం పోలీసులు రంగంలోకి దిగగా ఈ విషయం బయటపడింది. కేసు వివరాలను సిపి సిహెచ్‌.శ్రీకాంత్‌ సోమవారం మీడియాకు వెల్లడించారు. భీమిలి ప్రాంతానికి చెందిన వెంకట హేమంత్‌ రౌడీ షీటర్‌. మధుసూదన్‌ అనే రియల్టర్‌ను మోసం చేసేందుకు పన్నాగం పన్నాడు. తన ఫ్లాట్‌ అమ్ముతానని చెప్పడంతో రూ.30 లక్షల కమిషన్‌ ఇస్తే తాను అమ్మిస్తానని నమ్మబలికి ఆ తర్వాత కారులో దూరంగా తీసుకు వెళ్లి హేమంత్‌ అండ్‌ కో మధుసూదన్‌ను కిడ్నాప్‌ చేశారు. డబ్బులిస్తేనే విడిచి పెడతానని హెచ్చరించారు. భయపడిన బాధితుడు తన ఖాతాలో ఉన్న రూ.7.5 లక్షల నగదును వీరి ఖాతాకు బదిలీ చేశాడు. అక్కడితో ఆగక మధుసూదన్‌ వద్ద ఉన్న బంగారం, ఫోన్‌ కూడా తీసుకుని పరారయ్యారు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు తొలుత ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారిచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్‌లో దాక్కున్న హేమంత్‌ బృందాన్ని పట్టుకున్నారు. అరెస్టయిన వారిలో అప్పలరాజు, రాంబాబు అనే ఇద్దరు కానిస్టేబుళ్లున్నారు. ఈ ఇద్దరూ అల్లూరి జిల్లాలో గంజాయి స్మగ్లింగ్‌ కేసులో గతంలోనూ అరెస్టయ్యారు. హేమంత్‌ డబ్బు కోసమే ఈ కిడ్నాప్‌నకు పన్నాగం పన్నాడని, అందుకు కానిస్టేబుళ్ల సహాయం కోరాడని సిపి తెలిపారు. ఆయనపై త్వరలో పీడీ యాక్ట్‌ పెట్టే ఆలోచన ఉన్నట్టు చెప్పారు.