Oct 08,2023 20:56

ఆక్రమణకు గురవుతున్న చెరువు గర్భం ఇదే..

ప్రజాశక్తి - వేపాడ : మండలంలోని ఎన్‌కెఆర్‌ పురం తానాన చెరువు గర్భంలో నుండి సన్‌ప్లస్‌వే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి తన భూమికి దర్జాగా రోడ్డు వేసుకుంటున్నారు. ప్రభుత్వ భూముల్లో రహదారి వేసేందుకు కనీసం అనుమతులు తీసుకోకుండా వైసిపి నాయకుల సహకారాలతో రోడ్డు నిర్మాణం పనులు చేపడుతున్నారు. చెరువు గర్భంలో నుంచి రోడ్డు వేయడం వల్ల చెరువు దిగిన ఉన్న పంట పొలాలు ఆయకట్టుదారులకు నీరు నిలువ ఉండే అవకాశం లేకుండా పోతుందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే సర్పంచ్‌ జీ దేవి, రైతులు వి ముత్యాలు నాయుడు, ఎం చిన్న గోవింద, జి దేవుడు, ఎన్‌ దేముడు, వి పైడితల్లి తహశీల్దార్‌కు ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. వెంటనే రియల్‌ ఎస్టేట్‌కు వేస్తున్న రహదారిని నిలుపుదల చేసి అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.