- సిఐటియు రాష్ట్ర కార్యదర్శి నరసింగరావు
ప్రజాశక్తి ఇబ్రహీంపట్నం: ఎన్టిటిపిఎస్ మొయిన్ గేటు వద్ద స్ట్రగుల్ కమిటీ నాయకుల ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి నరసింగరావు మాట్లాడుతూ విద్యుత్ కార్మికులకు, కాంట్రాక్టు కార్మికులకు, ఇంజనీర్లకు అన్యాయం జరిగే విధంగా 2018 ప్రకారం పవర్ జాక్ యాజమాన్యంతో చీకటి ముసుగులో చేసుకున్న నష్టదాయకమైన రివర్స్ పిఆర్సిని వెంటనే రద్దు చేయాలన్నారు. వెట్టి చాకిరీ చేస్తున్న కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలన్నారు. ఈపీఎఫ్ టు జిపిఎఫ్ చేయాలన్నారు. పీసు రేటు కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కార్మికులతో పాటు మహిళలకు ప్రత్యేక రక్షణ కల్పించాలని, కాంట్రాక్టు కార్మికులందరికీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కాంట్రాక్టు కార్మికులందరికీ అలవెన్సులు, పే స్లిపులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2023 రేట్లకు అనుగుణంగా విద్యుత్ యాజమాన్యం పిఆర్సి అమలు చేసేంత వరకు ఉద్యోగ, కార్మికులు తమ పోరాటాన్ని కొనసాగించాలని కోరారు. ఎఐటియుసి రాష్ట్ర సీనియర్ నాయకులు ఓబులేసు, ఎన్టీఆర్ జిల్లా సిఐటియు మహిళా నాయకురాలు కమల మాట్లాడుతూ కార్మికులతో చర్చించకుండా రివర్స్ పిఆర్సిపై ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి మహేష్, స్ట్రగుల్ కమిటీ నాయకులు కె.వాసుదేవన్, ఏసోబు, మల్లికార్జునరావు, జాన్ రాజు, మోహనరావు, నాగరాజు, నోయెల్, కొండలరావు, బాబుజీ, కామేశ్వరరావు, టియన్టియుసి నాయకులు దుర్గారావు పాల్గొన్నారు.










