Jan 09,2023 23:34

కలెక్టర్‌ మల్లికార్జునకు వినతిపత్రం అందిస్తున్న ఎమ్మెల్యే వెలగపూడి

ప్రజాశక్తి - ఆరిలోవ : ప్రభుత్వ భూముల్లో నివాసముంటూ జిఒ 296 ద్వారా చంద్రన్న పట్టా పొందిన వారికి ఉచితంగా రిజిస్ట్రేషన్‌ హక్కులు కల్పించాలని కోరుతూ విశాఖ కలెక్టర్‌ మల్లికార్జునకు తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆధ్వర్యాన టిడిపి నాయకులు సోమవారం స్పందన కార్యక్రమంలో వినతిపత్రం అందజేశారు. గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్న సమయంలో 2016, 2017 సంవత్సరంలో జిఒ 296 ప్రకారం ప్రభుత్వ భూముల్లో నివాసం ఉండే సుమారు 10 వేల మందికి చంద్రన్న పట్టాలు మంజూరు చేశారని, ఆ జిఒ ప్రకారం పట్టాలు మంజూరు చేసిన రెండేళ్ళ తరువాత రిజిస్ట్రేషన్‌ హక్కులు కల్పించాలని ఉందని తెలిపారు. పట్టాలు మంజూరు చేసి ఐదేళ్ళు గడిచినా నేటికీ రిజిస్ట్రేషన్‌ హక్కులు కల్పించలేదని చెప్పారు. ఈ విషయంపై ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు హైకోర్టును ఆశ్రయించారని తెలిపారు. దీనిపై నాలుగు వారాల్లోగా రిజిస్ట్రేషన్‌ చేయాలని జిల్లా కలెక్టర్‌, రిజిస్ట్రార్‌కు కోర్టు ఆదేశాలు జారీ చేసిందని, దాన్ని అమలుచేయాలని కోరారు. వినతి అందజేసిన వారిలో కార్పొరేటర్లు మద్దిల రామలక్ష్మి, గొలగాని మంగవేణి, టిడిపి నాయకులు బుడుమూరు గోవిందు, ఒమ్మి అప్పలరాజు, మద్దిల రాజశేఖర్‌, పొత్రకండ ధర్మారావు, గాడు అప్పలనాయుడు, గాడి సత్యం, తదితరులు ఉన్నారు.