ప్రజాశక్తి-పాడేరు: అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరుగుతున్న జగనన్న భూహక్కు, భూరక్షా పథకంలో భాగంగా రీ సర్వేలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరం లో రీసర్వే నోడల్ ఆఫీసర్స్ తహసిల్దార్లతో జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, రీ సర్వే లో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి వాటిని అధిగమించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఎదురయ్యే సమస్యలు, వాటి పరిష్కారాలను విస్తతంగా చర్చించి దిశా నిర్ధేశం చేశారు. సమస్యలకు సరైన మార్గాలను చూపుతూ రీసర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. తహసిల్దార్ కార్యాలయంలో రీసర్వే రికార్డ్లను భద్రపరుచాల్సిందేనని కలెక్టర్ స్పష్టం చేశారు. అందుకు అవసరమైన బీరువాలను ఏర్పాటు చేయాలని జారీ చేశారు. ఈ సమావేశంలో జాయింట్ కలక్టర్ జె.శివ శ్రీనివాసు, ఐటిడిఏ పిఓ రోణంకి గోపాలకృష్ణ, సబ్ కలక్టర్ వి. అభిషేక్లకు రీసర్వే వేగవంతంపై తగిన సూచనలు అందజేశారు. ఈ సమావేశంలో డిఅర్ఓ పి.అంబేద్కర్, తహసిల్దార్లు పాల్గొన్నారు.










