రెండు గ్రామాల మధ్య సాగునీటి వివాదం
- వారం రోజులుగా నడుస్తున్న వైనం
- జడ్పిటిసి వ్యాఖ్యలపై రైతులు ఆగ్రహం
- తెలుగు గంగ అధికారులకు ఫిర్యాదు - పరిశీలన
ప్రజాశక్తి - మహానంది
మహానంది మండలంలోని రెండు గ్రామాల మధ్య గత వారం రోజుల నుండి నీటి వివాదం నెలకొంది. దీనికి తోడు జడ్పిటిసి మహేశ్వర రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు గంగ ప్రధాన కాలువ నుండి 10వ బ్లాక్ ద్వారా తిమ్మాపురం, అబ్బీపురం, పుట్టుపల్లె, బొల్లవరం గ్రామాలకు చెందిన పంట పొలాలు దాదాపు 250 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది. మిగిలిన నీరు వాగులు, వంకల ద్వారా సమీపంలోని చెరువులకు చేరుతుంది. ఈ సాగునీరు కొంత భాగం తమ్మడపల్లె పంట పొలాలకు వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదే అదునుగా భావించిన ఆయన పదవ బ్లాక్ నుండి సాగునీటిని అక్రమంగా తరలించటానికి పిల్ల కాలువల ద్వారా వివిధ మార్గాల వైపు వెళ్లడానికి అవకాశం ఉన్న ప్రధాన కూడలిలో ఒకచోట అడ్డుకట్టను జడ్పిటిసి తన అనుచరవర్గంతో తొలగించడంతో వివాదం నెలకొంది. గత ఏడాది తమ్మడపల్లె గ్రామ రైతుల పంట పొలాలకు సాగునీటి కోసం 11వ బ్లాక్ను ఆధునీకీకరణ చేపట్టి సాగునీటి ఇబ్బందులు లేకుండా స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి చొరవతో సమస్యను పరిష్కరించుకున్నారు. కానీ ఇప్పుడు పదవ బ్లాక్ నుండి కూడా నీటిని అక్రమంగా తరలించుకుపోతే పంటలు పండించుకునేది ఎలా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. అయితే జడ్పిటిసి తన అనుమతి లేకుండా తొలగించిన అడ్డుకట్టను అధికారులు మళ్లీ ఏర్పాటు చేస్తే వారిని ఇంటికి పంపిస్తానని పేర్కొనడం వివాదాస్పదంగా మారింది. ఇతర గ్రామాల రైతులు తమ పొలాలకు సాగునీరు రాకుండా అడ్డుకట్ట వేసి నీటిని వాడుకోవడంతో తొలగించడానికి చర్యలు తీసుకున్నానని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం చర్చనీయాం శంగా మారింది. కాలువల నిర్మాణ సమయంలో అధికారులు ఏర్పాటు చేసిన దిమ్మలను తొలగించారు. మళ్లీ రైతులు కొంత మొత్తంలో తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. దానిని కూడా తొలగించడంతో రైతులు తెలుగు గంగ అధికారులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలాన్ని తెలుగు గంగ డిఈ నాగ మధుసూదన రావు, ఏఈ జగదీష్ కుమార్ పరిశీలించారు. చట్టపరంగా చర్యలు తీసుకోవాలని రైతులు అధికారులను కోరారు. ఈ సందర్భంలోనే జడ్పిటిసి ఫోన్ ద్వారా సంప్రదించగా పై వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారింది. ఏదైనా సమస్య ఉంటే అధికారులకు తెలియజేసి పరిష్కరించాల్సిన ప్రజాప్రతినిధి అధికారులను సస్పెండ్ చేయిస్తానని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం పలు విమర్శలకు తావిస్తోంది. ప్రజాప్రతినిధి అధికార పార్టీకి చెందిన నేత కావడంతో అధికారులు రైతులకు అప్పటికి న్యాయం చేస్తామని చెప్పి వెళ్లిపోవడం శోచనీయం.










