ప్రజాశక్తి-నక్కపల్లి: మండలంలోని రేవుపోలవరం లో ఈనెల 5న మాఘ పౌర్ణమి జాతర సందర్భంగా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని నర్సీపట్నం డీఎస్పీ ప్రవీణ్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన నక్కపల్లి పోలీస్ స్టేషన్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, మాఘ పౌర్ణమి సందర్భంగా రేవుపోలవరం సముద్ర తీరంలో ఎటు వంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లాలో పలు సర్కిల్ నుంచి పోలీస్ బందోబస్తును జాతరకు నియమిస్తున్నామన్నారు. ఈనెల 4వ తేదీ రాత్రి నుంచి 6వ తేదీ ఉదయం వరకూ అడ్డరోడ్డు, రేవుపోలవరంలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేస్తున్నామని, అడ్డరోడ్డు నుంచి రేవుపోలవడం వరకూ చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ముఖ్యంగా రేవుపోలవరం తీరానికి సముద్ర స్నానానికి వచ్చినప్పుడు పిల్లలు, ఆభరణాలను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. తీరం వెంబడి మెరైన్ పోలీసులతో పాటు గజ ఈతగాళ్లను కూడా సిద్ధం చేస్తున్నామన్నారు. ఆయన వెంట ఎస్ఐ శిరీష్ ఉన్నారు.
జాతర ఏర్పాట్లు ఎఎస్పి పరిశీలన
ప్రజాశక్తి-ఎస్.రాయవరం:మండలంలోని తీర ప్రాంతమైన రేవుపోలవరం గ్రామంలో ఈనెల 5న మాఘ పౌర్ణమి జాతరకు చేస్తున్న ఏర్పాట్లను నర్సీపట్నం ఏఎస్పీ కె.ప్రవీణ్ కుమార్ పరిశీలించారు. జాతరకు వచ్చే భక్తులకు వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ జాం కాకుండా తీసుకుంటున్న చర్యలను స్థానిక సీఐ నారాయణరావును అడిగి తెలుసుకున్నారు. సముద్ర తీరం వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేసారు. ఆయన వెంట ఎస్ఐ ప్రసాదరావు, గ్రామ సర్పంచ్ లోవరాజు, గ్రామ కార్యదర్శి లక్ష్మణరావు, చేపల రాజు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.










