ప్రజాశక్తి- పొన్నూరు : ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ ఎదుట శనివారం 12 గంటల ధర్నా చేయనున్నట్లు ఫ్యాప్టో జిల్లా చైర్మన్ ఎం.కళాధర్ తెలిపారు. ధర్నా జయప్రదం కోసం పొన్నూరు ప్రాంత ఫ్యాప్టో సమావేశంలో పట్టణంలోని యుటిఎఫ్ కార్యాలయంలో గురువారం నిర్వహించారు. సమావేశానికి యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి డి.సాయికృష్ణ అధ్యక్షత వహించగా కళాధర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులపై ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేస్తున్న దాడులు ఆపాలన్నారు. టీచర్లు మానసిక వేధింపులతో తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని, ఒక రోజులో ఉపాధ్యాయుడికి ఉన్న బోధనా సమయానికి, ప్రభుత్వం ప్రవేశపెడుతున్న కార్యక్రమాలకు పొంతనే ఉండట్లేదన్నారు. దీని వల్ల విద్యార్థులకు నష్టం జరుగుతోందని, బోధనకు ఆటంకంగా మారిన యాప్ను రద్దు చేయాలని కోరారు. సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలని, పిఆర్సి ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ అంశాలపై నిర్వహించే ధర్నాకు ఉపాధ్యాయులంతా తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు బి.ఆదిలక్ష్మి, ఎస్టియు నాయకులు హనుమంత ప్రసాద్, ఎపిటిఎఫ్ 1938 నాయకులు ఎం.వెంకటేశ్వరరావు, ఎం.వెంకయ్య, పి.వి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.










