ప్రజాశక్తి - ఆస్పరి
వర్షభావ పరిస్థితులతో రబీ సాగు ప్రశ్నార్థకంగా మారింది. గత రెండు నెలలుగా వర్షం కురవకపోవడంతో రబీ పంటలు సాగు చేసుకోలేక రైతులు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. నల్లరేగడి భూముల్లో రబీలో శనగ, వాము పంటలు వేసుకునేందుకు వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి భూములను చదును చేసి పంట సాగుకు సిద్ధం చేశారు. సాధారణంగా సెప్టెంబర్లో వాము, అక్టోబర్లో శనగ పంటలు సాగు చేయాల్సి ఉండగా వర్షాలు రాకపోవడంతో సాగుకు నోచుకోలేదు.
కొనుగోలు చేసిన శనగ విత్తనాలు అమ్ముతున్న రైతులు
ఆస్పరి మండలంలో రబీలో ప్రధానంగా శనగ పంట సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉంటుంది. మండల వ్యాప్తంగా 20 వేల ఎకరాలకు పైగానే శనగ సాగు జరుగుతుంది. ప్రభుత్వం కూడా శనగ పంట సాగు చేసే రైతులకు సబ్సిడీ విత్తనాలను కూడా అందించింది. వ్యవసాయ శాఖ 5,800 క్వింటాల్ల విత్తనాలు రైతులకు పంపిణీ చేసింది. క్వింటా రూ.8,100 కాగా ప్రభుత్వం 40 శాతం సబ్సిడీతో క్వింటా రూ.4,860లకు రైతులు కొనుగోలు చేశారు. విత్తు అదును దాటడంతో రైతులు ఇంట్లో ఉన్న శనగ విత్తనాలు వ్యాపారులకు విక్రయిస్తున్నారు. కొంతమంది శనగ పంట సాగుకు తెచ్చిన అప్పులకు జమ అవుతుందన్న ఆలోచనతో అమ్ముకుంటున్నారు. మరి కొంతమంది రైతులు పంట సాగుకు సిద్ధం చేసుకున్న విత్తనాలను అమ్ముకుని వలస వెళ్తున్నారు. రబీ సాగు లేకపోవడంతో నల్లరేగడి భూములు ఎడారిని తలపిస్తున్నాయి.
వర్షాలు కురవకపోవడంతో శనగలను అమ్ముతున్నాం
- పల్లిదొడ్డి శాంతప్ప, రైతు, ఆస్పరి గ్రామం.
18 ఎకరాల్లో శనగ సాగు చేయాలని క్వింటా రూ.4,860 చొప్పున 9 క్వింటాళ్లకు రూ.43,740లతో శనగ విత్తనాలు కొనుగోలు చేశాను. సకాలంలో వర్షాల్లేక అదును తప్పడంతో శనగలు పురుగు పడుతాయన్న ఉద్దేశంతో ప్రభుత్వం అందించిన శనగలను వ్యాపారులకు అమ్ముతున్నాం.
విత్తనాలను అమ్ముతున్న రైతులు