జీలుగుమిల్లి : రౌడీషీటర్లు సత్ప్రవర్తన కలిగి ఉండాలని పోలవరం డిఎస్పి ఎ.శ్రీనివాసులు తెలిపారు. ఆదివారం జీలుగుమిల్లి సర్కిల్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తే అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిచారు. భవిష్యత్లో మంచి ప్రవర్తన కలిగి వున్న వారి రౌడీషీట్లు తొలగించేలా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ బి.వెంకటేశ్వరరావు, బుట్టాయగూడెం ఎస్ఐ వెంకన్న పాల్గొన్నారు.
నూజివీడు రూరల్ : పట్టణంలో రౌడీ షీటర్లకు ఆదివారం పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా నూజివీడు డిఎస్పి అశోక్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ప్రశాంతమైన జీవనం గడుపుతూ, సమాజంలో గౌరవప్రదంగా జీవించాలని సూచించారు. ఏ విధమైన అల్లర్లు, తగవులకు వెళ్లినా ఉక్కుపాదం మోపుతామని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం అందిస్తున్న అనేక సంక్షేమ పథకాలను ఉపయోగించుకొని స్వయం సమృద్ధి సాధించాలని, తద్వారా సమాజంలో, కుటుంబంలో విలువలను, గౌరవాన్ని పొందాలని సూచించారు.










