
ప్రతిగింజా కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశం
ఫిర్యాదులు వస్తే అధికారులపై చర్యలు
తేమ, నూకశాతంలో వ్యత్యాసం లేకుండా చూడాలి
గిరిజన ప్రాంతాల అభివృద్ధికి త్వరలో ఐటిడిఎలో సమావేశం
ఇసుక అక్రమరవాణాపై నిఘా
ఉమ్మడి జిల్లా ప్రజాపరిషత్ స్థాయీ సంఘ సమావేశాల్లో జెడ్పి చైర్పర్సన్ గంటా పద్మశ్రీ
ప్రజాశక్తి - ఏలూరు
ధాన్యం కొనుగోలులో అధికారులు రైతులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా 'రైతు ఫ్రెండ్లీ' విధానంలో ధాన్యం కొనుగోలుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలని జెడ్పి చైర్పర్సన్ పద్మశ్రీ అధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలోని సమావేశపు హాలులో గురువారం ఉమ్మడి జిల్లా ప్రజాపరిషత్ స్థాయీ సంఘ సమావేశాల్లో వివిధ అంశాలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా పద్మశ్రీ మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించే ధాన్యంను అమ్ముకునే సమయంలో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రూ.ఆరు లక్షలకు పైగా మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రావొచ్చని అంచనా ఉందని, అందుకు తగిన విధంగా రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. రైతుల నుండి ధాన్యం కొనుగోలులో రైతు భరోసా కేంద్రాలు, రైస్ మిల్లుల వద్ద వద్ద తేమ, నూక శాతం లెక్కింపులో వ్యత్యాసం ఉంటుందని, చిరిగిపోయిన గోనె సంచుల అందిస్తున్నారని, అదేవిధంగా రవాణాకు వాహనాల ఏర్పాటులో కూడా ఫిర్యాదులు వస్తున్నాయని, వీటన్నింటినీ అధిగమించి రైతులు రైస్ మిల్లర్ల నుండి ఎలాంటి సమస్యలూ ఎదుర్కోకుండా కస్టోడియన్ అధికారులు మరింత బాధ్యతతో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ మంజుభార్గవిని జెడ్పి చైర్పర్సన్ ఆదేశించారు. ప్రతిమండలంలోనూ మండల వ్యవసాయ సలహా మండలి సమావేశాలను ఏర్పాటు చేసి, రైతుల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖాధికారులను చైర్పర్సన్ ఆదేశించారు. ధాన్యం కొనుగోలు విధానం అంతా ఆన్లైన్లో నిర్వహిస్తున్నప్పటికీ, అధికారులు ముందుగానే క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలు తెలుసుకుని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుత సీజన్లో వర్షాభావ పరిస్థితుల కారణంగా పెదపాడు, కైకలూరు తదితర మండలాలకు చెందిన శివారు భూములకు కృష్ణా కాలువ నుండి సాగు, తాగునీరు సక్రమంగా అందడం లేదని, వంతులవారీ విధానాన్ని సక్రమంగా ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో తాగునీటికి ఎలాంటి కొరతా లేకుండా చర్యలు తీసుకోవాలని, జలజీవన్ మిషన్లో ప్రతి ఇంటికీ తాగునీటి కుళాయి అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
గిరిజన ప్రాంతాల్లో తాగునీరు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల అమలును సమీక్షించేందుకుగాను ఐటిడిఎలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని పద్మశ్రీ తెలిపారు. అధికారులు ప్రభుత్వం అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలను జెడ్పిటిసి సభ్యులకు, ఎంపిపిలకు, ఇతర ప్రజాప్రనిధులకు కూడా సమాచారం అందిస్తూ వారిని సమన్వయం చేసుకుని పథకాల అమలును మరింత వేగవంతం చేయాలన్నారు. కుక్కునూరు, వేలేరుపాడు పరిసర ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నట్లు కొంతమంది ప్రజాప్రతినిధులు తన దృష్టికి తీసుకువచ్చారని, దీనిపై క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ చేసి నివేదిక సమర్పించాలని గనుల శాఖ డిడిని ఆమె ఆదేశించారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై ప్రజల నుండి మంచి స్పందన వస్తుందని, పాఠశాలల్లోని విద్యార్థులకు కూడా నూరుశాతం ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని అధికారులను చైర్పర్సన్ ఆదేశించారు. ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో కంటి పరీక్షలు నిర్వహించిన వారికి కళ్లజోళ్లు అందించడం లేదని కొంత మంది సభ్యులు తెలియ జేయడంతో, వెంటనే పరిశీలించి చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ శర్మిష్టను ఆదేశించారు. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల నుండి వివిధ ఆరోగ్య సమస్యలపై జంగారెడ్డి గూడెం ఏరియా ఆసుపత్రికి వచ్చే రోగులను ఏలూరు ఆసుపత్రికి రిఫర్ చేస్తున్నారని సభ్యులు చైర్పర్సన్ దృష్టికి తీసుకురాగా, ఎంతో దూరం నుండి వ్యయప్రయాసలకోర్చి వచ్చే ప్రజలను అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఏలూరు ఆసుపత్రికి రిఫర్ చేయకుండా మెరుగైన వైద్య సేవలందించాలని వైద్యాధికారులను ఆదేశించారు.
గైర్హాజరైన అధికారులపై చర్యలకు సిఫార్సు
సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజాసమస్యలపై సమీక్ష నిర్వహించే జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలకు జిల్లా స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరు కావల్సిందేనని, గైర్హాజరైన వారిపై శాఖాపరమైన చర్యలకు సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు సిఫార్సు చేస్తామని పద్మశ్రీ హెచ్చరించారు. ఏలూరులో గురువారం జరిగిన ఉమ్మడి జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలకు పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలకు సంబంధించి కొందరు జిల్లాస్థాయి అధికారులు ముందస్తు అనుమతి తీసుకోకుండా సమావేశానికి రాకుండా తమ కింద స్థాయి అధికారులను పంపడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండో స్థాయీ సంఘ సమావేశంలో గృహనిర్మాణ శాఖ సమీక్షలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ అధికారి హాజరు కాకపోవడం, అదేవిధంగా నాలుగో స్థాయీ సంఘ సమీక్షలో పశ్చిమ గోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అందుబాటులో లేకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా పరిషత్ సమావేశాలకు తప్పనిసరిగా జిల్లా స్థాయి అధికారులు హాజరు కావాల్సిందేనని, హాజరు కానివారు శాఖాపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ఈ సమావేశంలో జెడ్పి సిఇఒ కె.రవికుమార్, జెడ్పి వైస్చైర్పర్సన్ శ్రీలేఖ, విజయబాబు, జిల్లా వ్యవసాయశాఖాధికారి వై.రామకృష్ణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.