
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
- ఎమ్మెల్యే శిల్పారవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా
- రైతులకు సబ్సిడీ శనగ విత్తనాలు పంపిణీ
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
రైతుల సంక్షేమమే వైసిపి ప్రభుత్వం ధ్యేయమని, రైతు పక్షపాతి అని మరోసారి నిరూపించిందని ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇస్సాక్ బాష పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ అధ్వర్యంలో రబీ సీజన్లో రైతులకు 40 శాతం సబ్సిడీపై శనగ విత్తనాలు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల పక్షాన నిలిచి రైతన్నలకు మంచి చేసే ప్రభుత్వం వైసిపి అన్నారు. రబీ సీజన్లో పంటల సాగు చేసేందుకు 40 శాతం సబ్సిడీపై శనగ విత్తనాలు అందిస్తున్నామని తెలిపారు. గత ఏడాది 25 శాతం సబ్సిడీ నుండి ఈ ఏడాది 15 శాతం సబ్సిడీ పెంచుతూ 40 శాతంపై అందిస్తున్నామని చెప్పారు. తాము అమలు చేస్తున్న పథకాలను టిడిపి వారు కాపీ కొట్టారన్నారు. మిర్చీ రైతులకు భరోసా కల్పిస్తూ సిఎం జగన్మోహన్ రెడ్డి మిర్చీ యార్డును నంద్యాలలో ఏర్పాటు చేశారని, నేడు విజయవంతంగా ముందుకు సాగుతుందని తెలిపారు. మిర్చీ రైతులు గుంటూరుకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. రైతుల కోసం మరో ముందడుగు వేస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి మిల్లెట్స్ సెకండరీ యూనిట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారన్నారు. నంద్యాల మండలం రాయమాల్పురంలో మిల్లెట్స్ సెకండరీ ప్లాంట్ ఏర్పాటుకు తాజాగా భూమి పూజ చేసినట్లు చెప్పారు. హార్టికల్చర్ రైతన్నలకు వ్యవసాయ ఉత్పత్తులను నిలువ చేసుకునేందుకు తొమ్మిది గోడౌన్లను నిర్మించేందుకు పనులను చేపట్టామని, వాటిని త్వరలో పూర్తి చేసి రైతన్నలకు అంకితం చేస్తామన్నారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ మహేశ్వరరెడ్డి, ఎంపీపీ శెట్టి ప్రభాకర్, వ్యవసాయ శాఖ అధికారులు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పురుషోత్తం రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.