ప్రజాశక్తి - ఆరిలోవ : జివిఎంసి 10వ వార్డు తోటగరువు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలను ఆనుకొని ఉన్న సుమారు 40 సెంట్ల రెవెన్యూ స్థలంలో 60 షాపులతో రైతుబజార్ నిర్మాణానికి మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, విఎంఆర్డిఎ చైర్పర్సన్ అక్కరమాని విజయనిర్మల, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆల్ఫా కృష్ణ గురువారం భూమిపూజ చేసి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎప్పటి నుంచో ఐదు వార్డుల ప్రజలు రైతుబజారు కావాలని అభ్యర్థన, అవసరం మేరకు మార్కెటింగ్ నిధులు రూ.80 లక్షలతో అత్యాధునికంగా నిర్మించనున్నట్లు తెలిపారు. రైతుబజార్ ఏర్పాటుకు ఇక్కడ స్థలం మంజూరు, రైతుబజార్ ఏర్పాటుకు కృషి చేసిన పూర్వ మార్కెటింగ్ చైర్మన్ అల్లంపల్లి రాజబాబును ప్రస్తుత మార్కెటింగ్ చైర్మన్ ఆల్ఫా కృష్ణను మేయర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు గొలగాని శ్రీనివాసరావు, పూర్వ మార్కెటింగ్ చైర్మన్ అల్లంపల్లి రాజబాబు, మాజీ కార్పొరేటర్ జగ్గుపిల్ల అప్పలరాజు, ఎడ్యుకేషన్ డైరెక్టర్ పతివాడ వెంకటలక్ష్మి, పతివాడ కనకరాజు, సత్యనారాయణ, బోని శ్రీనివాసరావు, మార్కెటింగ్ వైస్ చైర్మన్ యువతా రెడ్డి, డైరెక్టర్లు పాల్గొన్నారు.










